బాలకృష్ణకు శుభవార్త వినిపించిన కేంద్రం
కరోనా వచ్చిన తర్వాత భారతీయ రైల్వేలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. చిన్న చిన్న రైల్వేస్టేషన్లను మూసేయడంతోపాటు ప్యాసింజర్ రైళ్లను స్పెషల్ ఎక్స్ ప్రెస్ లుగా మార్చి ప్రయాణికుల నుంచి ముక్కుపిండి మరీ పెంచిన ఛార్జీలను వసూలు చేసేవారు. వాస్తవానికి ఈ రైళ్లన్నీ ప్యాసింజర్ రైళ్లు నడిచినట్లే నడుస్తాయి. ఛార్జీలు మాత్రం భారీగా ఉంటాయి. రూ.30 ఛార్జీని రూ.60 చేశారు. రూ.10 ఛార్జీని రూ.30 చేశారు. ఇలా ప్యాసింజర్ ఛార్జీలను పెంచుకుంటూ పోవడంతో చిరు వ్యాపారులతోపాటు సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
దీనిపై కొన్నాళ్ల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఎట్టకేలకు అధికారులు ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలను పునరుద్ధరించారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలకృష్ణకు కూడా ఎన్నికల సమయంలో రైల్వే శుభవార్త వినిపించిందంటున్నారు. హిందూపురం నుంచి గుంతకల్లు వరకు తిరిగే ప్యాసింజర్ రైలు ఛార్జీలను పునరుద్ధరించారు. కరోనా సమయంలో హిందూపురం నుంచి అనంతపురంకు రూ.55, గుంతకల్లుకు రూ.80 వసూలు చేశారు. ప్రస్తుతం హిందూపురం నుంచి అనంతపురం వెళ్లేందుకు రూ.30, హిందూపురం నుంచి గుంతకల్లు వెళ్లేందుకు రూ.45 చెల్లించాల్సి ఉంటుంది.

సాధారణ కార్యకలాపాల్లో భాగంగా భారతీయ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణకు కలిసివస్తుందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. హిందూపురం నుంచి బెంగళూరు, తిరుపతి, చెన్నై వెళ్లేందుకు రైళ్ల సౌకర్యాన్ని కల్పించాలని తమ నాయకుడు కేంద్రాన్ని కోరనున్నారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications