సర్వే విరుద్ధం: ఇంద్రసేన్, ఇంటికో ఈక: మోత్కుపల్లి
హైదరాబాద్ : ఈ నెల 19 తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర సర్వే రాజ్యాంగ విరుద్ధమని బిజెపి సీనియర్ నేత ఎన్. ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. సమగ్ర సర్వేపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ఆయన బుధవారం మీడియా వద్ద స్పందించారు.
వ్యక్తుల మతం, కులం, పాన్కార్డు నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పాలని అడిగే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. ఈ వివరాలు దుర్వినియోగమైతే పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఇంద్రసేనారెడ్డి తెలిపారు. కేంద్రం సేకరించే జనాభా లెక్కల్లో కూడా కులం, మతం ప్రస్తావన ఉండదని ఆయన గుర్తు చేశారు.
దళితులకు భూపంపిణి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం దళితులందరికీ విధిగా మూడెకరాల భూమి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పరిపాలనపై తనదైన శైలిలో మోత్కుపల్లి విమర్శలు గుప్పించారు. కెసిఆర్ పరిస్థితి ఊరికొక కోడి... ఇంటికొక ఈక అన్న చందంగా ఉందని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు. దళితులందరికీ మూడెకరాలు భూమి ఇస్తానని హామీ ఇచ్చారు కాబట్టి ఇచ్చి తీరాల్సిందేనని ఆయన ఆయన అన్నారు.