కిషన్ 'ఇంటెలిజెన్స్' హెచ్చరిక, ఆపాలని కేసీఆర్కు జేసీ
హైదరాబాద్: కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంబంధాలు దెబ్బతిన్నాయని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన చేసే విమర్శల పైన ఇంటెలిజెన్స్ రిపోర్టులు వెళ్తున్నాయని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
విద్యుత్ సంక్షోభాన్ని అరికట్టేందుకు తాము ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని విద్యుత్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని, ఢిల్లీకి వెళ్లి మోడీని కలుస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు మేలు జరగాలనేదే తమ అభిమతమన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పాదన పైన అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం స్పందించారు. కృష్ణా జలాలు సముద్రంలోకి వెళ్లినా ఫర్వాలేదు అన్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యవహరిస్తున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని సమస్యకు పరిష్కారం చూపించాలని కోరారు. కెసీఆర్ మొండి వైఖరితో రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. కనీసం మానవాదృక్పథంతోకేసీఆర్ ఇప్పటికైనా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పాదన ఆపివేయాలని కోరారు. కాగా, తాడిపత్రిలో జరిగిన పార్టీ కార్యక్రమానికి కేఈ కృష్ణమూర్తి హాజరయ్యారు. కానీ జేసీ సోదరులు హాజరు కాలేదు. ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వనందునే తాము హాజరు కాలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది.
సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేతకు కసరత్తు
సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారి పైన కేసులు ఎత్తివేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 910 కేసులను పోలీసు శాఖ గుర్తించినట్లుగా తెలుస్తోంది.
ఉద్యోగుల విభజనపై టీఎన్జీవో డెడ్ లైన్
ఉద్యోగుల విభజన పైన టీఎన్జీవో కేంద్రానికి డెడ్ లైన్ విధించింది! నవంబర్ 1వ తేదీలోగా ఉద్యోగుల విభజన పూర్తవ్వాలని టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్ మంగళవారం అన్నారు. లేకుంటే వచ్చే నెల 26, 27 తేదీల్లో తాము ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామన్నారు.
ఉద్యోగుల విభజన సమస్యలన్నింటిని పరిష్కరించాలని కేంద్రం పైన ఒత్తిడి తెస్తామన్నారు. సచివాలయంలో ఇంకా ఆంధ్రా పెత్తనం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు కార్పోరేట్ వైద్యం పైన ఆసక్తి చూపిస్తున్నారన్నది అవాస్తవమన్నారు. రైతులు, సాధారణ ప్రజలు, పథకాలు తదితరాల కోసం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తామన్నారు.
దానంపై గవర్నర్ నరసింహన్
కార్పోరేట్ సంస్థలు కేవలం కొంత సొమ్మును సామాజిక బాధ్యతగా విదిల్చే పద్ధతి నుండి బయటకు రావాలని గవర్నర్ నరసింహన్ మంగళవారం అన్నారు. సహయోజన పేరుతో హైదరాబాదులోని రామకృష్ణా మఠం ఆధ్వర్యంలో కార్పోరేట్ సోషల్ రెస్బాన్స్ బిలిటీ కింద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్పోరేట్ సంస్థలు, ఇతర వ్యాపారులు ప్రజాసేవను కేవలం కొంత సొమ్మును ధానంగా ఇచ్చే ప్రక్రియగా మాత్రమే చూస్తున్నారని, ఇది తప్పన్నారు.
అన్ని కార్పోరేట్ సంస్థలు తాము ఖర్చు చేస్తున్న మొత్తాన్ని ఓ చోట చేర్చి ఆ సొమ్ముతో పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేయాలన్నారు. విద్య, వైద్యం, ఇతర సేవా కార్యక్రమాలకు వెచ్చించడం లేదా ఓ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా దత్తత తీసుకోవడం వంటి చర్యలు చేపట్టాలన్నారు.
స్వామి వివేకానంద సూచించిన రోగి దేవో భవ, మూర్ఖ దేవో భవ వంటి మాటలను ఆచరణలోకి తీసుకు వచ్చి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచేలా కార్పోరేట్లు ఉండాలన్నారు. కంపెనీలు తాము సామాజిక బాధ్యతగా వెచ్చించే మొత్తాన్ని ఓ చోట చేర్చడం ద్వారా రామకృష్ణా మిషన్, సత్యసాయి సేవా సంఘం వంటి సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications