కేసీఆర్ టు నితీష్, పవన్ టు బాబు: నోట్ల రద్దు - రసవత్తర రాజకీయం
నోట్ల రద్దు రాజకీయాల్లో మిత్రులను శత్రువులుగా, శత్రువులను మిత్రులుగా చేస్తోంది! నోట్ల రద్దు ప్రకటన అనంతరం పార్టీల తీరులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
న్యూఢిల్లీ/అమరావతి: నోట్ల రద్దు అంశం దేశంలో చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా ఇది రాజకీయాల్లోను మిత్రులను శత్రువులుగా, శత్రువులను మిత్రులుగా చేస్తోంది! నోట్ల రద్దు అనంతరం పార్టీల తీరులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

స్వాగతించిన కేసీఆర్, నితీష్
నోట్ల రద్దు అంశాన్ని.. ప్రధాని మోడీకి రాజకీయ శత్రువుగా భావించే బీహార్ సీఎం నితీష్ కుమార్ స్వాగతించారు. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పూర్తిగా సమర్థించారు. అయితే ఇబ్బందుల పైన అసంతృప్తి వ్యక్తం చేశారు.

చంద్రబాబు, పవన్ యూ టర్న్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలుత నోట్ల రద్దును స్వాగతించి, ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా అంతే. నోట్ల రద్దు మంచిదేనని తొలుత చెప్పిన పవన్.. ఇప్పుడు ఇది చారిత్రాత్మక తప్పిదమని చెబుతున్నారు.

కాంగ్రెస్ నిరసన
కాంగ్రెస్ పార్టీ నేతలు నోట్ల రద్దు పైన భిన్నంగా స్పందిస్తున్నారు. కానీ ఇది మాత్రం ఘోర తప్పిదమని చెబుతున్నారు. నోట్ల రద్దు ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దు అంశం మంచిదే అయినా, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఓ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నారు.

మమత సీరియస్
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నోట్ల రద్దును గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. లెఫ్ట్ పార్టీ కూడా వ్యతిరేకిస్తోంది. కానీ ఢిల్లీలో చేసిన ఆందోళనలో మాత్రం మమతా బెనర్జీ కలిసి రాలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నోట్ల రద్దును తప్పుబడుతున్నారు.

నవీన్ పట్నాయక్
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నోట్ల రద్దును స్వాగతించడం గమనార్హం. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ తన మన్ కీ బాత్లో చెప్పారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ బీహార్ సీఎం నితీష్, ఒడిశా సీఎం నవీన్ మద్దతిచ్చారని, ధన్యవాదాలు అన్నారు.

శివసేన రివర్స్ గేర్!
మహారాష్ట్రలో బీజేపీకి శివసేన మిత్రపక్షం. అయితే, బీజేపీతో పాటు ఎంఎన్ఎస్ కారణంగా శివసేన మహారాష్ట్రలో ఇబ్బందిక పరిస్థితులు ఎదుర్కొంటోంది. సైద్ధాంతికంగా ఈ పార్టీలు దగ్గరగా ఉంటాయి. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు శివసేన అప్పుడప్పుడు కొన్ని అంశాలపై బీజేపీని నిలదీస్తోంది. నోట్ల రద్దును కూడా తొలుత వ్యతిరేకించింది. ఆ తర్వాత సమర్థించింది.












Click it and Unblock the Notifications