పెగాసెస్ పై ఏబీ క్లారిటీ - ఆ నేతలపై పరువు నష్టం వేస్తా : నేనూ ఆంధ్రాలోనే- అక్కడ కాదు..!!
రాష్ట్రంలో ఇప్పుడు కలకలం రేపుతున్న పెగాసెస్ వ్యవహారం పైన ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వేంకటేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుదీర్ఘ కాలం నిఘా చీఫ్ గా పని చేసిన ఏబీ వేంకటేశ్వరరావుకు ఇందులో ప్రమేయం ఉందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను 30 ఏళ్ల ఐపీఎస్ అధికారిగా పని చేసానని..ఈ పెగాసెస్ పైన ఆందోళన పెరగకుండా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సి ఉందనే కారణంతోనే తాను వివరణ ఇస్తున్నానని చెప్పారు. తాను 2019 మే వరకు నిఘా చీఫ్ గా ఉన్నానని.. పెగాసెస్ కొనుగోలు జరగలేదని తేల్చి చెప్పారు.

పెగాసెస్ కొనుగోలు జరగలేదు
అదే విషయాన్ని 2021 లో డీజీపీ కార్యాలయం సైతం తేల్చి చెప్పిందని గుర్తు చేసారు. ఎవరి ఫోన్లు ట్యాపింగ్ .. హ్యాకింగ్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడూ కొనని సాఫ్ట్ వేర్ గురించి సమాధానం చెప్పాల్సి రావటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. తన కేసుల గురించీ ఏబీ వివరించారు. తన పైన జరుగుతున్న విచారణ తప్పు దోవ పట్టించటం కోసం కొన్ని తప్పుడు పత్రాలను ఫోర్జరీ చేసారని ఆరోపించారు. కొందరు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అటువంటి వారి పైన పరువునష్టం దావా వేయటానికి సీఎస్ అనుమతి కోరారని చెప్పారు.

ఆ వైసీపీ నేతలపై కేసు వేస్తానని
విజయ సాయిరెడ్డితో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు...గుడివాడ అమర్నాద్.. అబయ్య చౌదరి తో పాటుగా కొన్ని మీడియా సంస్థల పేర్లు ప్రస్తావించారు. ఈ రోజు సీఎస్ ను కలిసిన తాను మూడు అంశాల పైన వినతి పత్రాలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. తన సస్పెన్షన్ అంశం సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు. తన సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చిన సమయంలో ఉద్దేశ పూర్వకంగా తన పైన తప్పుడు ప్రచారం మీడియా వారికి ఉద్దేశ పూర్వకంగా అందించారని ఆరోపించారు. తనను ప్రభుత్వం సస్పెండ్ చేయటం..విచారణ చేసే అధికారాలు ఉన్నాయని వివరించారు. తన పైన చేసిన విష ప్రచారంలోని ఒక్క అంశం కూడా ఛార్జ్ షీట్ లో లేవని చెప్పుకొచ్చారు. తనను దేశ ద్రోహిగా .. దేశ రహస్యాలను విదేశాలను చేరవేసానంటూ చేసిన ప్రచారం పైన ఆవేదన వ్యక్తం చేసారు.

తనను వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటూ
ఇక, ఇప్పుడు పెగాసెస్ పైన శాఖా పరమైన విచారణ ఉంటుందని తాను అనుకోవటం లేదన్నారు. తనను తాను రక్షించుకో లేని పరిస్థితుల్లో ప్రజలను ఎలా రక్షిస్తానని ప్రశ్నించారు. ఇక, ఇదే సమయంలో ఏబీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ఏపీలోనే పుట్టానని..ఏపీలోనే పెరిగానని..తనకు మర్యాద ఉంటుందని చెప్పారు. తాను నాగాలాండ్ నుంచో ఎక్కడ నుంచో రాలేదని వ్యాఖ్యానించారు. పది జిల్లాల్లో పని చేసానని.. విజయవాడ నగర పోలీసు కమిషనర్ గా రెండు సార్లు పని చేసానన్నారు. తనకు వ్యక్తిత్వం ఉంటుందని.. తనకు కుటుంబం ఉందని పేర్కొన్నారు. తన పైన విచారణ త్వరగా పూర్తి చేయాలని తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరానని ఏబీ వేంకటేశ్వర రావు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications