జగన్ చేతిలోనే రిమోట్ కంట్రోల్ : పవన్ కు అంతుచిక్కని బీజేపీ రాజకీయం: చంద్రబాబుతోనే బెటరా...!
ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..? బీజేపీతో జతకట్టిన పవన్ కళ్యాణ్ మౌనం వెనక కారణమేంటి..? ఆంధ్రా రాజకీయాల్లో బీజేపీ మిత్రపక్షం ఎవరు పవనా.. జగనా..? బీజేపీతో చెలిమి కోసం ఎదురుచూస్తోన్న చంద్రబాబుకు అందుతున్న సంకేతాలేంటి..? కరోనా సమయంలో సైతం ఏపీ రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. వైసీపీ-బీజేపీల మధ్య పరోక్ష మైత్రి కంటిన్యూ అవుతూనే ఉంది. అధికారిక మిత్రుడు పవన్ కంటే అనధికారిక మిత్రుడు జగన్ మాటకే విలువ కనిపిస్తోంది. బీజేపీ అంతర్గత వ్యవహారాలపై ఆ పార్టీ రాష్ట్ర నేతలకంటే వైసీపీ కీలక నేతల పట్టు ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఎన్నో ఆశలు కమలంతో జతకట్టిన పవన్కు పరోక్షంగా పవన్ -బీజేపీల మైత్రి బలోపేతం కావాలని కోరుకుంటున్న టీడీపీకి ఆశాభంగంగా మిగులుతోంది. పవన్తో మైత్రి ఉన్నట్లా లేనట్లా...?

మైత్రి కుదిరాక ఒకే వేదికపై కానరాని బీజేపీ-జనసేన
ఈ ఏడాది సంక్రాంతి సమయంలో బీజేపీ జనసేన మధ్య ఏపీలో అధికారిక పొత్తు కుదిరింది. ఇక వైసీపీపై కలిసి పోరాటం చేస్తాయని రెండు పార్టీలు ప్రకటించాయి. వందరోజులు పూర్తయినా ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేక పోయాయి. అమరావతి అంశంలో కలిసి పనిచేస్తామని చెప్పినా అడుగు ముందుకు పడలేదు. విడివిడిగా ఉన్న సమయంలో అమరావతి కోసం రోడ్ల మీదకు వచ్చిన రెండు పార్టీల ముఖ్యనేతలు... పొత్తు ఖరారయ్యాక అమరావతిలో కాలుకూడా పెట్టలేదు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్... వేగంగా పావులు కదిపారు. బీజేపీతో మైత్రి అందుకున్న తర్వాత కూడా ప్రధాని అమిత్ షాల అప్పాయింట్మెంట్ పవన్కు దొరకలేదు. కానీ అదే సమయంలో సీఎం జగన్ ఆ ఇద్దరితోనూ సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పిన వైసీపీ
ఇక రాష్ట్ర స్థాయిలో జరిగిన పరిణామాల్లోనూ బీజేపీ జనసేన ప్రభుత్వంపై ఎటువంటి పోరాటం చేయలేకపోయాయి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్పై వైసీపీ ప్రభుత్వం మండిపడింది. ఆయన్ను తప్పించేందుకు కొత్త ఆర్డినెన్స్ను తెచ్చింది. రాష్ట్రస్థాయిలో బీజేపీ-టీడీపీ-జనసేన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. కానీ వైసీపీ ముఖ్యనేతలు మాత్రం ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పారు. తమ ఆర్డినెన్స్కు గవర్నర్ వద్ద అభ్యంతరం రాకుండా చూసుకున్నారు. కేంద్రం సహకరించకపోతే గవర్నర్ అంత త్వరగా ఆర్డినెన్స్ ఆమోదించే అవకాశం ఉండదన్నది జనసేన బీజేపీ నేతల అభిప్రాయం.

సాయిరెడ్డి వివాదంలోనూ అదే బాట...
ఇక బీజేపీలో నిధుల గోల్మాల్, చంద్రబాబు వద్ద కన్నా లక్ష్మీనారాయణ రూ.20 కోట్లు తీసుకున్నారంటూ వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీనికి కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్స్ సైతం దుర్వినియోగం చేశారంటూ సాయిరెడ్డి ఆరోపణలు చేశారు. బీజేపీ అంతర్గత వ్యవహారాల గురించి సాయిరెడ్డికి ఏం సంబంధమంటూ ప్రశ్నించిన కొందరు కమలం పార్టీ నేతలు నిధులు గోల్మాల్ జరగలేదనే విషయంపై మాత్రం ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు.
గతంలోనే ఇదే అంశంపై పార్టీలో కొంత రచ్చ జరిగింది. దాని కారణంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ రాంమాధవ్ సైతం ఏపీ వ్యవహారాలకు దూరమయ్యారు. అదే సమయంలో పార్టీ కోశాధికారి సైతం రాజీనామా చేశారు. కన్నాకు పార్టీలో పెద్దగా మద్దతు లభించలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాత్రం కన్నాపై వచ్చిన ఆరోపణలను తప్పుబట్టారు. ఈ వ్యవహారంతో బీజేపీ నేతలు ఇక వైసీపీని ఉపేక్షించరని వైసీపీ బీజేపీల మధ్య రగడ మొదలైనట్టేనని అంచనా వేశారు. కానీ అక్కడే సీన్ రివర్స్ అయ్యింది.

జనసేన ఆవేదన ఏంటి..?
కరోనా కిట్లు కొనుగోలు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనేది ఏపీ బీజేపీ నేతలు, టీడీపీ నేతల ఆరోపణ. దీనికి కౌంటర్గానే సాయిరెడ్డి నేరుగా కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కన్నాను తప్పించడం ఖాయమనే ప్రచారం పార్టీలో మొదలైంది. ఈ వ్యవహారంలో జనసేన మౌనం పాటించింది. బీజేపీ జనసేన మిత్రులుగా ఉన్నా... ఏ ఒక్క విషయంలోనూ పవన్కు ప్రాధాన్యత లభించడం లేదనేది ఆపార్టీ నేతల ఆవేదన. రాజ్యసభలో వైసీపీ సహకారం అవసరం కావడంతో ఆ పార్టీ నేతలకు బీజేపీ అధినాయకత్వం ప్రాధాన్యత ఇస్తోంది.
బీజేపీ వైసీపీ ముఖ్యనేతల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. దీంతో జనసేనకు ఏంచేయాలో మింగుడు పడటం లేదు. బీజేపీతో కలిసిన తర్వాత పార్టీకి మేలు జరుగుతుందని జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ తమ పవర్ స్టార్ గుర్తింపు పొందుతారని ఆశించినా పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశే మిగులుతోంది. కరోనాపై ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతో పాటుగా దాదాపుగా అన్ని పార్టీల అధినేతలకు ఫోన్లు చేసి మాట్లాడారు. కానీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్కు మాత్రం ఫోన్ కాల్ రాలేదు.
Recommended Video

ఢిల్లీలో డెసిషన్.. అమరావతిలో వైబ్రేషన్స్
చంద్రబాబు తనంతకు తానుగా కాల్ చేసిన తర్వాత మరుసటి రోజు ప్రధాని మోడీ నుంచి కాల్ వచ్చింది. మిత్రపక్ష నేతలందరికీ ఫోన్లు చేసి స్వయంగా మాట్లాడిన ప్రధాని పవన్కు ఎందుకు చేయలేదు అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. ఇక విజయసాయిరెడ్డి ఎపిసోడ్లోనూ ఢిల్లీ నుంచి బీజేపీ ముఖ్యనేత సూచనతో జగన్ ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి తన విమర్శలకు ముగింపు పలికారు. అదే విధంగా బీజేపీ నుంచి విమర్శలు నిలిచిపోయాయి.
ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలను ఈ అంశం స్పష్టం చేస్తోంది. దీంతో జాతీయస్థాయిలో మోడీ-అమిత్షా పేర్లు పదేపదే ప్రస్తావించే పవన్ కళ్యాణ్కు తాజాగా వైసీపీకి ఇస్తున్న ప్రాధాన్యత రుచించడం లేదు. తమను మిత్రపక్షంగా గుర్తించడం లేదనేది జనసేన నేతల ఆవేదన. టీడీపీకి ఈ వ్యవహారం మింగుడుపడటం లేదు. బీజేపీతో తాము సఖ్యతగానే ఉంటూ జనసేన టీడీపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనేది వైసీపీ వ్యూహం. అయితే కరోనా ఎపిసోడ్ ముగిసిన తర్వాత ఏపీ కేంద్రంగా కీలక రాజకీయ సమీకరణాలు చోటుచేసుకునే అవకాశాలు ఉందనేది విశ్లేషకుల అంచనా.












Click it and Unblock the Notifications