ముద్రగడతో చంద్రబాబు పీఠం కదులుతుందా?: 'అంతం చేయాలనే'
గుంటూరు: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ పీఠం కదులుతుందా? అంటే అవుననే అంటున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, రోజాలు విడివిడిగా మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడారు.
ముద్రగడ పాదయాత్ర ద్వారా టిడిపి పీఠం కదులుతుందని, అందుకే ఆయనకు అనుమతి ఇవ్వడం లేదని రోజా ఆరోపించారు. కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండుతో సత్యాగ్రహ పాదయాత్ర చేపడుతున్న ముద్రగడను భౌతికంగా అంతం చేయాలనే వేధిస్తున్నారని అంబటి రాంబాబు సంచలన ఆరోపణ చేశారు.
ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు చేయడం కొత్త కాదన్నారు. ముద్రగడ మాత్రం అలా పాదయాత్ర చేయడానికి అనుమతి లేదని హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివ రావు చెప్పడం విడ్డూరమన్నారు. వాళ్లిద్దరు చెప్పినంత మాత్రాన చట్టాలు మారిపోతాయా అని నిలదీశారు.
ముద్రగడ పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ముద్రగడ ఇంటి పక్కన చిన్న జిన్నింగ్ మిల్లు ఉంటే దానిని ఆక్రమించుకొని పోలీసులు అక్కడకు చేరారన్నారు. ఇది సరైన విధానం కాదన్నారు. దీనిని మార్చుకోవాలని చెబుతున్నామని చెప్పారు.
ముద్రగడను అడ్డుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్నారు. పాదయాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. అవి కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉంటాయని చెప్పారు. ముద్రగడ పాదయాత్రకు పదిహేను వేల మంది పోలీసులను మోహరించారన్నారు.
ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మిలిటరీ పాలన సాగుతోందా అని నిలదీశారు ముద్రగడ సత్యాగ్రహ యాత్ర చేపట్టడానికి చంద్రబాబే కారణం అని చెప్పారు. కాపులను ఆరు నెలల్లో బీసీలలో చేరుస్తామని చెప్పి , ఇప్పటి దాకా హామీ నెరవేర్చలేదన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేస్తే అణిచివేసే ప్రయత్నాలు సరికాదన్నారు. ముద్రగడ ఏకాకి కాదని, ఆయన వెనుక రాష్ట్ర ప్రజానీకం ఉందని చెప్పారు. వైసిపి, కాంగ్రెస్ పార్టీలతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలు ఆయనకు అండగా నిలబడ్డాయన్నారు. తను ఘటన తర్వాత ఇదే ముద్రగడ నిరాహార దీక్ష చేస్తే వెళ్లిన మంత్రులు ఆగస్టులోపు కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పారని గుర్తు చేశారు.
దానిని నిలబెట్టుకోలేకపోవడంతో ఇప్పుడు ఆయన సత్యాగ్రహ పాదయాత్ర చేస్తున్నారన్నారు. తుని ఘటన తర్వాత ఆయన కుటుంబాన్ని తవ్రంగా అవమానించి 15 రోజుల పాటు ఆసుపత్రిలో ఖైదీగా బంధించి ఇబ్బంది పెట్టారన్నారు. అయినా ఆయన ధైర్యంతో ప్రాణాలను సైతం పణంగా పెట్టి విజయం సాధిస్తారన్నారు. ఇప్పుడు మరోసారి తన ప్రాణాలు పణంగా పెడుతున్నారన్నారు. గతంలో వంగవీటి రంగాను కూడా వేధించి హత్య చేసింది అప్పటి టిడిపియే అన్నారు.