మంత్రుల్ని చంద్రబాబు ప్రిపేర్ చేస్తున్నారా ? సీనియర్లలో ఆ టెన్షన్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిది నెలలవుతోంది. ఈ ఎనిమిది నెలల్లో ప్రభుత్వం పాలనలో కుదురుకుంది. అయితే మంత్రులు మాత్రం తమ శాఖలపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొందరు మాత్రం ఇప్పటికే తమ శాఖలపై పట్టు పెంచుకుని రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులకు ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టులు ఇచ్చేస్తున్న సీఎం చంద్రబాబు.. తాజాగా ర్యాంకులు కూడా బహిరంగంగానే విడుదల చేశారు.
ఇందులో తనకు ఆరో స్ధానం, కుమారుడు లోకేష్ కు ఎనిమిదో స్ధానం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పదో స్ధానం ఇచ్చారు. ఈ జాబితాలో సీనియర్ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కు మొదటి స్ధానం, జూనియర్ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు చివరి స్ధానం దక్కాయి. అయితే ఈ ర్యాంకుల్ని డిసెంబర్ వరకూ ఉన్న గణాంకాల ఆధారంగా ఇచ్చారని చెప్పారు. ఇందులో ఫైళ్ల క్లియరెన్స్ వేగం ఆధారంగా ర్యాంకులు ఇచ్చారని కూడా చెప్పారు. అయితే కారణాలు ఏవైనా ఇలా బహిరంగంగా మంత్రుల పనితీరును ప్రజల్లో పెట్టడం మంచిదా కాదా అన్న చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు ఇలా బహిరంగంగా మంత్రుల ర్యాంకింగ్స్ బయటపెట్టడం వెనుక వారిని ఓ విషయంలో ప్రిపేర్ చేసేందుకే అన్న చర్చ మొదలైంది. అదే కేబినెట్ ప్రక్షాళన. రెండు నెలల క్రితం త్వరలో మంత్రివర్గంలోకి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును తీసుకుంటానని చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేసారు. అప్పటి నుంచి కేబినెట్ ప్రక్షాళనపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో నాగబాబు కేబినెట్లోకి వచ్చేస్తారని ఓసారి, రాకుండా ఎంపీగా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని మరోసారి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ ప్రక్షాళన మాత్రం ఖాయమని తేలిపోయింది.
దీంతో మంత్రుల్ని ఆ దిశగా సిద్దం చేయడమే చంద్రబాబు టాస్క్ గా మారినట్లు అర్దమవుతోంది. ముఖ్యంగా నిన్నటి ర్యాంకుల్లో చివరి స్దానంలో ఉన్న జూనియర్ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై చంద్రబాబు అసంతృప్తి పలు సందర్భాల్లో కనిపిస్తూనే ఉంది. అదే సమయంలో పలువురు సీనియర్ మంత్రులు కూడా వెనుకబడి ఉన్నట్లు ర్యాంకులు స్పష్టం చేశాయి. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పడం ద్వారా కేబినెట్ ప్రక్షాళనలో వీరి పేర్లు కూడా ఉండొచ్చన్న సంకేతాల్ని చంద్రబాబు ఇచ్చారని చెబుుతున్నారు. ఫైనల్ గా పనితీరు బాగోలేకపోతే ఎవరినీ ఉపేక్షించబోమన్న సంకేతం చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.












Click it and Unblock the Notifications