హైదరాబాద్-షిర్డీ మధ్య తిరుగుతున్న మల్లాది విష్ణు? చింటూకు రిమాండ్
చిత్తూరు/విజయవాడ: కృష్ణా జిల్లాలో కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడు మల్లాది విష్ణు ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఆయన మహారాష్ట్రలోని షిర్డీలో ఉన్నట్లుగా స్థానికంగా ప్రచారం సాగుతోంది. ఆయన షిర్డీలో ఉన్నట్లు వాట్సప్ ద్వారా పలువురికి సందేశాలు వచ్చాయి.
కల్తీ మద్యం కేసులో కొద్ది రోజుల క్రితం అయిదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మల్లాది తల్లి పేరిట ఉన్న స్వర్ణ బార్లో ఈ కల్తీ మద్యం వెలుగు చూసింది. అప్పటి నుంచి విష్ణు కనిపించడం లేదు. నాటి నుంచి అతను హైదరాబాద్-షిర్డీ మధ్య తిరుగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
స్వర్ణబార్ మల్లాదిదే అని తేలింది: కొల్లు రవీంద్ర
స్వర్ణబార్ మల్లాది విష్ణుదే అని విచారణలో తేలిందని మంత్రి కొల్లు రవీంద్ర శాసన సభలో మంగళవారం చెప్పారు. కల్తీ కల్లు మృతి పైన కొల్లు సభలో ప్రకటన చేశారు. కల్తీ మద్యం వల్ల మృతి చెందిన వారికి రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చినట్లు చెప్పారు.
మేయర్ హత్య కేసులో నిందితులకు జనవరి 2 వరకు రిమాండ్
చిత్తూరు జిల్లా మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ల హత్యల కేసులో ప్రధాన నిందితుడు చింటూతో పాటు మిగతా నిందితులను పోలీసులు మంగళవారం నాడు న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారికి న్యాయస్థానం జనవరి 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
కొద్ది రోజుల క్రితం చిత్తూరు నగర మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్లు మున్సిపల్ కార్యాలయంలోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఇరవై మంది దాకా అరెస్టు చేశారు. జంట హత్యల విషయమై ఇంకా విచారణ కొనసాగుతోంది.