విజయసాయిరెడ్డి సీఎం జగన్కు బలమా..బలహీనతా : ఎక్కడ తేడా వచ్చింది: మారుతున్న లెక్కలు...!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వీర విధేయుడు..నమ్మిన బంటు విజయ సాయిరెడ్డి. వైయస్సార్ హయాం నుండి నేడు జగన్ పాలనా వ్యవహారాల్లో కీలక నేతగా ఉన్నారు. ఇక, జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా విచారణ..జైలు శిక్ష అనుభవించారు. జగన్ సైతం విజయసాయిరెడ్డికి దాదాపుగా పార్టీలో తన తరువాతి స్థానం కల్పించారు. ఢిల్లీలో జగన్ ప్రతినిధిగా..రాజ్యసభ సభ్యుడిగా ఎంపీగా ఎన్నికైన నాటి నుండి ఇప్పటికీ క్రియా శీలకంగా ఉన్నారు. కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు..బీజేపీ ..వైసీపీ మధ్య సంధాన కర్తగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర పెద్దలు..సీఎం జగన్ మధ్య వారధి సాయిరెడ్డే.
కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నుండి ఆయన వ్యవహార శైలిలో కొంత మార్పు కనిపిస్తోంది. జగన్ పైన సాయిరెడ్డి విధేయత పైన విమర్శకులు సైతం అభినందిస్తారు. కానీ, కొంత కాలంగా సాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు...వాటి కారణంగా ఏర్పడుతున్న వివాదాలు ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు విజయ సాయి రెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు ప్రస్తుత పరిస్థితుల్లో బలమా..బలహీనతా..పార్టీలో ఏం జరుగుతోంది...
సీఎం జగన్ రూటే సపరేటు: ఆ అధికారికి కీలక పోస్టు: తన కారణంగా ఇబ్బందులు పడటంతో...!
అధికారంలో వచ్చినప్పటి నుండి మార్పు...
జగన్ పాదయాత్ర సమయంలో దాదాపుగా పార్టీ వ్యవహారాలన్నీ నేతలతో సమన్వయం చేసుకుంటూ విజయ సాయి రెడ్డి చక్క పెట్టారు. పార్టీకి నిధులు..నేతలకు విధులు...పార్టీ నియామకాలు అన్నింటీనీ తానై చూసుకున్నారు. ఇక, ఎన్నికల వేళ టీడీపీకి నాడు సహకరిస్తున్న నేతల పైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..డీజీపీ..నిఘా చీఫ్ తో సహా పలు జిల్లాల ఎస్పీల తొలిగింపు లో ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడిపారు.
టీడీపీ నేతలను వైసీపీకి తీసుకొచ్చే విషయంలోనూ ప్రధాన భూమిక పోషించారు. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాతసైతం జగన్ పైన సాయిరెడ్డి విధేయత విషయంలో మాత్రం మార్పు లేదు. కానీ, కొన్ని అంశాల్లో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే వాదన పార్టీలోనే వినిపిస్తోంది. అవి కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్ కు...పార్టీకి ఇబ్బందిగా మారుతోందని వైసీపీలో చర్చ జరుగుతోంది.
మోడీ-షాలతో చర్చించాకే ...
ముఖ్యమంత్రిగా జగన్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు..పోలవరం కాంట్రాక్టు రద్దు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. అవి జాతీయ స్థాయిలో వివాదానికి కారణమయ్యాయి. ఆ సమయంలో ఢిల్లీ కేంద్రంగా సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి.
ప్రధాని మోడీ..అమిత్ షా తో చర్చించిన తరువాతనే తాము ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నామని చెప్పటం ద్వారా..అటు బీజేపీ నేతలకు..ఇటు సీఎం జగన్ కు ఆ వ్యాఖ్యలు ఇబ్బంది కలిగించాయని అప్పట్లో పార్టీలో చర్చ సాగింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రధాని చనువుగా సాయిరెడ్డిని పలకరించటం చూసిన వారంతా దాని పైనే చర్చించుకున్నారు. కానీ, జగన్ కు ప్రధాని..అమిత్ షా అప్పాయింట్మెంట్ల విషయంలో విజయసాయిరెడ్డి సరిగ్గా డీల్ చేయాలేకపోయారనే వాదన ఉంది.
హడావుడి వ్యాఖ్యలు..వివాదాలకు వేదికలు
వైసీపీలో ముఖ్యమంత్రి జగన్ తరువాత సాయిరెడ్డి కే పార్టీలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల సమయంలో సాయిరెడ్డికి శాసనమండలిలో సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆ బిల్లులు మండలిలో చర్చ జరిగిన రెండు మూడు రోజుల పాటు గ్యాలరీలోనే ఉన్నారు.
విరామ సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రులకు సూచనలిస్తూ కనిపించారు. అయితే, టీడీపీ వ్యూహాలను పసిగట్టటంలో విఫలమయ్యారు. సీనియర్ మంత్రులు..సాయిరెడ్డి అక్కడే మకాం వేసినా..బిల్లులు పాస్ చేయించుకోలేక పోయారు. సాయిరెడ్డి తెర వెనుక ఉండి సమన్వయం చేసుకోవాల్సిన సమయంలో నేరుగా గ్యాలరీలోనే కూర్చోవటంతో...మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం చివరి నిమిషంలో గ్యాలరీలో కూర్చొని మండలి ఛైర్మన్ ను ప్రభావితం చేయగలిగే అవకాశం ఏర్పడిందనే వాదన విశ్లేషకుల నుండి వ్యక్తమైంది.
గంటా పార్టీలోకి వస్తారంటూ...
ఇక, జగన్ పాదయాత్ర సమయంలో గంగవరం పోర్టు సీఈఓగా ఉన్న మాజీ డీజీపీ నండూరు సాంబశివరావు జగన్ను కలిశారు. ఆ వెంటనే సాయిరెడ్డి స్పందిస్తూ సాంబశివరావు వైసీపీలో చేరుతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీని పైన సాంబశివరావు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చుకున్నారు. ఇక, గంటా శ్రీనివస రావు సైతం వైసీపీలోకి వస్తున్నారని గతంలో చెప్పిన సాయిరెడ్డి..కొద్ది రోజుల క్రితం గంటా ను వైసీపీలోకి తీసుకొనేది లేదని వ్యాఖ్యానించారు. ఓపెన్ గా పార్టీలో చేరికల గురించి ప్రస్తావించటం పైన సొంత పార్టీలోనే విమర్శలు వచ్చాయి.
ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా...
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయ సాయిరెడ్డి..ఏపీ ప్రభుత్వం విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు నిర్ణయం ప్రకటించిన సమయం నుండి ఎక్కవ సమయం విశాఖలోనే గడుపుతున్నారు. అయితే, అక్కడ మంత్రులు ఉండగా..సాయిరెడ్డి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయటం..వాటికి ఛైర్ గా వ్యవహరించటం..మంత్రులను పక్కన కూర్చోబెట్టకొని..తానే సూచనలు చేయటం వివాదానికి కారణమైంది. ఇక, బీజేపీలో రాష్ట్ర స్థాయిలో పొత్తు లేకున్నా..జాతీయ స్థాయిలో వైసీపీ నేతలు పరోక్ష మైత్రి కొనసాగిస్తున్నారనే వాదన ఉంది. రాజ్యసభలో సైతం ప్రభుత్వ నిర్ణయాలకు వైసీపీ సైతం మద్దతిస్తూనే ఉంది.
విజయసాయి వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ
ఇక, తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా పైన వ్యక్తిగత విమర్శలు చేయటం..బీజేపీలో జరిగిన ఆర్దిక వ్యవహారాల పైన విమర్శలు చేయటం కమలం పార్టీ నేతలకు రుచించలేదు. దీని పైన ఢిల్లీ నుండి బీజేపీ పెద్దల జోక్యంతో..ముఖ్యమంత్రి సూచనల మేరకు సీరియల్ గా సాగిన విజయ సాయిరెడ్డి ఆరోపణలకు ముగింపు లభించింది.
గతంలో సాయిరెడ్డి మాత్రమే వైసీపీ నుండి ఢిల్లీలో కీలక నేతగా ఉండేవారు. ఇక, ఇప్పుడు వైసీపీ నుండి 22 మంది ఎంపీలు ఉన్నారు. మిధున్ రెడ్డి లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త పరమిళ్ నత్వానీ సైతం వైసీపీ సభ్యుడిగా రాజ్యసభలో కాలు పెట్టటం లాంఛనమే. దీంతో..సాయిరెడ్డి వివాదాలకు దూరంగా ఉండటంతో పాటుగా..ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఉందని పార్టీ నేతల అంతర్గత చర్చల్లో వినిపిస్తోంది.
Recommended Video