టీటీడీ సభ్యుడి ఇంట్లో 70కోట్ల కొత్త నోట్లు.. జయలలితకు మద్దతుదారుడే!
టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో దాదాపు 70కోట్ల విలువ చేసే కొత్త నోట్లు బయటపడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
చెన్నై: ఓ పక్క దేశంలోని సామాన్యులంతా కొత్త నోట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంటే.. టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో దాదాపు 70కోట్ల విలువ చేసే కొత్త నోట్లు బయటపడటం విస్మయానికి గురిచేస్తోంది. ఐటీ అధికారుల దాడుల్లో భాగంగా గురువారం నాడు శేఖర్ రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా.. ఈ విషయం వెలుగుచూసింది.
మొత్తం రూ.90కోట్ల నగదుతో పాటు సుమారు 100 కేజీల బంగారం శేఖర్ రెడ్డి ఇంట్లో దొరికినట్టుగా తెలుస్తోంది. శేఖర్ రెడ్డితో పాటు అతని సన్నిహితులు ప్రేమ్, శ్రీనివాసరెడ్డి నివాసాల్లో కూడా ఐటీ తనిఖీలు నిర్వహిస్తోంది. అన్నా నగర్, టీనగర్ సహా మరో ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తోంది.
ఇంత భారీ మొత్తంలో డబ్బు ఎక్కడినుంచి వచ్చిందన్న దానిపై ప్రస్తుతం ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు. తనిఖీల్లో మొత్తం 60మంది అధికారులు పాల్గొన్నట్టుగా సమాచారం. బ్యాంకు అధికారులు ఎవరైనా సహకరించారా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
శేఖర్ రెడ్డి జయలలిత, శశికళ మద్దతుదారు?
టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో భారీ ఎత్తున కొత్త నగదు నోట్లు బయటపడిన నేపథ్యంలో.. ఆయనకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. తమిళ దివంగత సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళల మద్దతు శేఖర్ రెడ్డికి ఉన్నట్టుగా తెలుస్తోంది.
జయలలిత, శశికళల మద్దతుతోనే కాంట్రాక్టర్ గా ఉన్న శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీరి మద్దతును ఉపయోగించుకుని పలువురు పెద్దలను తనవైపుకు తిప్పుకున్న శేఖర్ రెడ్డి..తద్వారా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన వద్ద రూ.90కోట్ల భారీ నగదుతో పాటు 100కేజీల బంగారం బయటపడినట్టుగా తెలుస్తోంది.