రాజధానికి టైం పడుతుంది: బాబు, స్మార్ట్గా కుప్పం
చిత్తూరు: తనకు కుప్పం ప్రజలే స్ఫూర్తి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు మంగళవారం పర్యటించారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలం మిట్టపల్లిలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మిట్టపల్లి గ్రామస్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని స్మార్ట్, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతామన్నారు. కరవును జయించేలా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. కుప్పంలో 20ఏళ్లుగా ప్రతిపక్షమే లేదని అన్నారు. ఈ ఏడాది వర్షపాతం చాలా తక్కువగా ఉంది.. భూ గర్భ జలాల పెంపునకు అందరూ సహకరించాలని కోరారు.
ఏ రాజకీయ నాయకుడికి ఇవ్వని గౌరవం తనకు ఇచ్చిన ప్రజలను మరవలేనన్నారు. మంచికి మారుపేరు కుప్పం అని చంద్రబాబు అన్నారు. ఎన్ని కష్టాలున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు రాత్రిబవళ్లు పనిచేస్తున్నానని చంద్రబాబు అన్నారు.
కొత్త రాజధాని నిర్మాణానికి ఇంకా సమయం పడుతుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రైతులను ఆదుకునేందుకు రుణమాఫీకి శ్రీకారం చుట్టామని వివరించారు.
గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రతీ గ్రామానికి నీళ్లిచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తనదేనని బాబు తెలిపారు. విద్యుత్ సౌకర్యం కల్పించి నియోజకవర్గంలో పరిశ్రమలు పెడతామని చెప్పారు. తనపై ఆడబిడ్డలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు.
కుప్పంకు కోటి 90లక్షల నిధులను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. మినీ మార్కెట్ యార్డను కూడా మంజూరు చేస్తున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారు. కరువును జయించేలా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మనరాష్ట్రంలో నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
గోదావరి జలాలను రాయలసీమకు తరలించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. వర్షాభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటినందున కరవును జయించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నానని ఆయన అన్నారు. శ్రీశైలం నుంచి నీళ్లు రాయలసీమకు తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజనతో ఆదాయం తగ్గినా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం కృషి చేస్తున్నానన్నారు.
డబ్బుల్లేకున్నా, కష్టాలున్నా రైతు రుణవిముక్తి చేశానన్నారు. పండ్లతోటలు వేసుకున్న రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రావెల కిశోర్బాబు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.