కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు-తేల్చేసిన ఆయుష్ కమిషనర్-అది ఆయుర్వేదం కాదు,నాటు మందు...
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందును నాటు మందుగా గుర్తించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. అది ఆయుర్వేద మందు కాదని,దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవీ ఇందులో పాటించట్లేదని తెలిపారు. అయితే ఈ మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని... కాబట్టి ఇది హానికరం కాదని స్పష్టం చేశారు. కంటిలో వేసే డ్రాప్స్లోనూ సాధారణ పదార్థాలే ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. శనివారం(మే 22) ఆయుష్ ప్రతినిధుల బృందం ఆనందయ్య మందు తయారీని ప్రత్యక్షంగా పరిశీలించింది.
Recommended Video

వంశపారపర్యంగా ఇస్తున్నారు...
ఆనందయ్య మందును పరిశీలించడానికి ముందే ల్యాబ్లో దాని నమూనాలను పరిశీలించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఆ ఫలితాలు,క్షేత్ర స్థాయి అధ్యయనం,మందు తీసుకున్నవారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఆనందయ్య మందును నాటు మందుగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. వంశపారంపర్యంగా ఆయన మందులు ఇస్తున్నారని... ఇప్పుడు కరోనా పేరుతో ఇస్తున్న మందు కూడా నాటు మందేనని తెలిపారు. ఈ మందు వినియోగంలో ఎవరికి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఆ నివేదికలు వచ్చాకే ప్రభుత్వ నిర్ణయం
ఆనందయ్య నాటు మందుపై ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ (సీసీఆర్ఏఎస్)కు నివేదిక పంపించనున్నట్లు రాములు తెలిపారు. తిరుపతి,విజయవాడల్లోని ఆయుర్వేద వైద్య బృందాలు కూడా ఆనందయ్య మందును పరిశీలించి నివేదికను తయారుచేయనున్నట్లు చెప్పారు. ఈ రిపోర్టులన్నీ వచ్చాకే మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తమ పరిశీలనలో మందు తయారీకి సంబంధించి ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని స్పష్టం చేశారు.

ఆనందయ్య మందులో హానికర పదార్థాలు లేవు...
నాటు వైద్యంలో ఉన్న అనుభవం ఆధారంగా ఆనందయ్య పిడికిలి కొలతతోనే ముడి పదార్థాలను మిక్సీలో వేసి మిశ్రమం తయారుచేస్తున్నారని చెప్పారు. కంటిలో వేసే చుక్కలకు ముళ్ల వంకాయలు,తోక మిరియాలు,తేనెలతో మిశ్రమాన్ని తయారుచేస్తున్నట్లు తెలిపారు. ఇందులోనూ ఎటువంటి హానికర పదార్థాలు లేవన్నారు. ఇక ఆనందయ్య మందుపై ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకునేంతవరకూ కృష్ణపట్నం ఎవరూ రావొద్దని పోలీసులు,అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో సెక్షన్ 144 విధించారు.

టీటీడీ ఆయుర్వేద విభాగం పరిశీలన
చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ... టీటీడీ ఆయుర్వేద విభాగంలో ఆనందయ్య మందును అభివృద్ది చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఐసీఎంఆర్ అధ్యయనంలో సానుకూల ఫలితాలు వస్తే ఆ నిర్ణయం తీసుకుంటామన్నారు.
కేంద్ర ఆయుష్ శాఖ దీనికి ఆమోదముద్ర వేస్తే నరసింగాపురంలోని శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో దీన్ని తయారుచేయవచ్చునని టీటీడీ ఆయుర్వేదిక్ ప్రొఫెసర్లు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.శనివారం(మే 22) టీటీడీ ఆయుర్వేద విభాగం శాస్త్రవేత్తలు,ప్రొఫెసర్లతో కలిసి కృష్ణపట్నం గ్రామాన్ని చెవిరెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా ఆనందయ్య మందుపై క్షేత్ర స్థాయిలో వివరాలు తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications