రాష్ట్రానికి తీవ్రనష్టం.. చంద్రబాబుకు జగన్ తాజా డిమాండ్!
ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెలిగొండ ప్రాజెక్ట్ పై పలు సూటి ప్రశ్నలను సంధించారు. కరవుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించడంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపటం లేదని జగన్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్ను వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామని జాతికి అంకితం కూడా చేశామన్నారు జగన్ .
వెలిగొండ ప్రాజెక్ట్ పై చంద్రబాబు పట్టింపు ఎక్కడ?
తమ హయాంలో 2005లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన దివంగత మహానేత వైయస్సార్ కలలను సాకారం చేశామన్నారు. ఇంకా ఆర్ అండ్ ఆర్ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఈ సీజన్లోనే దానికి కావాల్సిన సుమారు రూ.1200 కోట్లు చెల్లిస్తే, ప్రాజెక్టులో వెంటనే నీరు నిల్వ చేయవచ్చునని జగన్ సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్నా ఆర్ అండ్ ఆర్పై ప్రయత్నిస్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదని అన్నారు.

బాబు హయాంలో సాగునీటి ప్రాజెక్ట్ ల విషయంలో రాష్ట్రానికి నష్టం
గత చంద్రబాబు పాలన సమయంలో కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అమాంతంగా సివిల్ వర్క్స్ ఎస్టిమేట్లు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద చంద్రబాబుకు ఉన్న యావ, నిర్వాసితులను ఆదుకోవడంలో ఎప్పుడూ కనిపించ లేదని జగన్ ఆరోపించారు. గండికోటకు సంబంధించి కూడా ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి, నీళ్లు నింపడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చూపారని జగన్ విమర్శలు గుప్పించారు.
వైసీపీ హయాంలో జరిగిన ప్రాజెక్ట్ పనులు
వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు సుమారు రూ.1000 కోట్లు చెల్లించి, పూర్తిస్థాయిలో 27 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని ఆయన పేర్కొన్నారు. అలాగే చిత్రావతి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆర్ అండ్ ఆర్ కింద రూ.250 కోట్లను మా ప్రభుత్వమే చెల్లించి పూర్తిస్థాయిలో 10 టీఎంసీల నీటిని నిల్వ చేసినట్టు జగన్ చెప్పారు.
చంద్రబాబుకు ఆర్ అండ్ ఆర్ పై నిర్లక్ష్యం
బ్రహ్మసాగర్కు కూడా రూ.60కోట్ల ఖర్చుతో డయాఫ్రం వాల్ పూర్తి చేసి, శ్రీశైలం నుంచి తెలుగు గంగ కెనాల్ లైనింగ్ కూడా పూర్తి చేసి, 17వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లగలిగామని తమ హయాంలోనే ప్రాజెక్ట్ లపై శ్రద్ధ పెట్టామన్నారు . ఎప్పుడో పూర్తైన పులిచింతల ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ను కూడా చంద్రబాబు అప్పుడు పట్టించుకోలేదని విమర్శించారు. రూ.140 కోట్లను తామే ఖర్చు చేసి పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసినట్టు చెప్పారు.
వెలిగొండ పై జగన్ డిమాండ్
ప్రస్తుతం కరువు నేలకు అందాల్సిన కృష్ణా వరద జలాలన్నీ కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్ మీదుగా కడలిపాలు అవుతున్నాయని జగన్ పేర్కొన్నారు. వెలిగొండ ఆర్ అండ్ ఆర్ అంశంపై చంద్రబాబు దృష్టి పెట్టాలని, వెంటనే ఈ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ కింద చెల్లింపులు చేసి ఈ సీజన్లోనే నీటిని నింపి సాగు, తాగునీటిని అందించాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాను అని జగన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications