మండలి రద్దుపై జగన్ సర్కార్ యూ టర్న్ ? ప్రతిపాదన విరమించుకుంటారా ! మారిన పరిస్ధితుల్లో
ఏపీలో అధికార వికేంద్రీకరణకు ఉద్దేశించిన రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత మండలి ఆమోదం లేకపోయినా ఆటోమేటిగ్గా చట్టంగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనలు కూడా వేగంగా మారిపోతున్నాయి. గతంలో మండలి రద్దు కోసం కేంద్రానికి పంపిన ప్రతిపాదనలను విరమించుకుంటే ఎలా ఉంటుందని వైసీపీ ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగో మరో 9 నెలల్లో మండలిలో వైసీపికి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉండటం దీనికి మరో కారణం.
అసెంబ్లీకి హాజరవుతాం.!వైసీపి విధానాలను ప్రజలకు ఎత్తి చూపిస్తాం.!టీడీపీ సంచలన నిర్ణయం.!
మండలి రద్దు అవసరమా ?
ఏపీలో ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల్లోనూ శాసనమండలి రద్దు అవసరమా అన్న చర్చ సాగుతోంది. అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉంది. మరో 9 నెలలు ఆగితే మండలిలోనూ మెజారిటీ వచ్చేస్తుంది. ఆలోపు మండలి రద్దు కావడం ద్వారా వైసీపీ ప్రభుత్వానికి ఒనగూరే ప్రత్యేక ప్రయోజనం ఏంటనే చర్చ ఊపందుకుంటోంది. మండలితో సంబంధం లేకుండానే రెండు కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవడంతో ఇక మండలి రద్దు చేసి సాధించేదేమిటని వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
మండలి రద్దు నిర్ణయం ఉపసంహరణ...?
శాసనమండలి రద్దు కోసం ఇప్పటికే కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రతిపాదన పంపింది. వివిధ కారణాలతో ఇది వాయిదా పడుతూ వస్తోంది. దీంతో మండలి రద్దు ప్రతిపాదనను బిల్లు రూపంలో పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ముందుకొస్తుందా లేదా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే కేంద్రం ఈ ప్రతిపాదన ఆమోదించి బిల్లు పెట్టి ఉంటే జగన్ సర్కారు మరో మాట లేకుండా రాజధాని బిల్లులను ఆమోదింపజేసుకుని ఉండేది. అలా కాకుండా కేంద్రం దీన్ని నాన్చడం ద్వారా జగన్ సర్కారుకు వెసులుబాటు ఇచ్చిందనేవాదన కూడా వినిపిస్తోంది.
త్వరలో ఢిల్లీకి జగన్, మండలి అజెండా... ?
కరోనా లాక్ డౌన్ సడలింపుల తర్వాత సీఎం జగన్ కు ఓసారి అపాయింట్ మెంట్ ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చివరి నిమిషంలో దాన్ని రద్దు చేశారు. అప్పట్లో నిసర్గ తుపాను సహాయక చర్యల్లో బిజీగా ఉన్నందున మరోసారి కలుద్దామని జగన్ కు సూచించారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు కూడా ముగుస్తున్న తరుణంలో మరోసారి జగన్ కు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చే అవకాశముంది. ఈ సందర్భంగా మండలి వ్యవహారాన్ని జగన్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ పార్లమెంటులో బిల్లు పెట్టనందున మండలి ప్రతిపాదన విరమించుకుంటామని అమిత్ షాకు ప్రతిపాదించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Recommended Video
టీడీపీ ఎమ్మెల్సీలకు ఊరట....
తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాము కోరుకున్న విధంగా రాజధాని బిల్లులు ఆమోదం పొందడంతో ఇక జగన్ సర్కారు మండలి రద్దు ప్రతిపాదనను విరమించుకుంటుందని టీడీపీ కూడా అంచనా వేస్తోంది. అదే జరిగితే కనీసం రాబోయే 9 నెలల పాటు తమ పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్సీలు పదవుల్లో కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్ అదే నిర్ణయం గనుక తీసుకుంటే మౌనంగా ఉండటమే మేలనే ఉద్దేశం టీడీపీలో కనిపిస్తోంది. మండలి రద్దుకు సంబంధించి గతంలో జగన్ ప్రతిపాదన చేసినప్పుడు విమర్శలు చేసిన టీడీపీ నేతలు.. తాజాగా దీనిపై మౌనం వహిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.