జగన్ సర్కార్ కీలక నిర్ణయం-పేద విద్యార్ధులకు 25 శాతం ఫ్రీ సీట్లు-వచ్చే విద్యాసంవత్సరం నుంచి
ఏపీలో విద్యాహక్కు చట్టం కింద పేదలకు ఇవ్వాల్సిన ఉచిత సీట్లను కేటాయించకపోవడంపై హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ పై జగన్ సర్కార్ కీలక హామీ ఇచ్చింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని హైకోర్టుకు తెలిపింది. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చినా ఈ నిర్ణయం అమలు కాకపోవడంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఏపీలోని ప్రైవేటు విద్యాసంస్ధల్లో నిరుపేద విద్యార్ధులకు సీట్ల కేటాయింపు చేయకపోవడంపై హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వం వివరణ కోరింది. దీనిపై స్పందించిన వైసీపీ సర్కార్.. హైకోర్టుకు ఇవాళ వివరణ ఇచ్చింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పేదలకు సీట్లపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 25శాతం సీట్లు కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో పేదలకు సీట్లు ఇవ్వాలంటూ.. న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈ విచారణ జరిగింది.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్ధులకు ప్రైవేటు విద్యాసంస్ధల్లో సైతం ఉచిత విద్య అందేలా రాష్ట్రాలు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ప్రభుత్వాలు విద్యాసంవత్సరాన్ని సైతం అతి కష్టం మీద కొనసాగిస్తున్నాయి. దీంతో పేదలకు ఉచిత సీట్ల కేటాయింపు సాధ్యం కాలేదు. దీంతో వచ్చే ఏడాది నుంచి సీట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ ఏడాది నుంచే దీనిని అమలు చేయాలని పిటిషనర్ కోరగా.. ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నందున వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో హైకోర్టు దీనిపై సంతృప్తి వ్యక్తం చేసింది.