ఏపీలో స్కూళ్ల మూసివేత, టీచర్ల బదిలీలు, కొలువుల భర్తీపై సజ్జల కీలక వ్యాఖ్యలు -ఏపీలో మొత్తం ఉద్యోగాలెన్ని?
కరోనా నియంత్రణ, ఉద్యోగాల హామీ అమలు, విద్యా వ్యవస్థ పటిష్టత తదితర అంశాల్లో జగన్ సర్కారు దారుణంగా ఫెయిలైందన్న విమర్శలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు కౌంటరిచ్చారు. బడుల మూసివేత, టీచర్ల బదిలీలు, ఉద్యోగాల కల్పనపై చంద్రబాబు అనుకూల మీడియాలో తప్పుడు ప్రచారం హోరెత్తుతోందని ఆరోపించిన ఆయన.. వాస్తవాలు ఇవంటూ సజ్జల వివరణ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు..
''ఉద్యోగాల భర్తీపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. నాడు-నేడు ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే, దానిపైనా విషం కక్కుతోంది. ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల శాతం భారీగా పెరిగింది. గడిచిన రెండేళ్లలో విద్య, వైద్య రంగాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండేళ్లలోనే సుమారు 2 లక్షల ఉద్యోగాలు కల్పించాం.

సీఎం జగన్ ప్రమాణస్వీకారం నాటికి రాష్ట్రంలో 5,14,056 ఉద్యోగాలు ఉంటే, ఇప్పుడు 6,96,526 ఉద్యోగాలు ఉన్నాయి. ఓ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత స్వల్ప వ్యవధిలో ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడైనా జరిగిందా? చంద్రబాబు తన ఐదేళ్ల పదవీ కాలంలో కేవలం 34 వేల ఉద్యోగాలిచ్చారు. మధ్యాహ్న భోజనంపై చంద్రబాబు పెట్టిన ఖర్చు రూ.515 కోట్లయితే, జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.1600 కోట్లు ఖర్చుపెడుతోంది.
చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నట్లు ఏపీలో ఏ ఒక్క స్కూల్ మూతపడదు, ఒక్క టీచర్ను కూడా తొలగించబోము. చంద్రబాబు రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలు మూసివేయలేదా? చంద్రబాబు అస్తవ్యస్తంగా మార్చిన విద్యారంగాన్ని ఇప్పుడు జగన్ చక్కదిద్దుతున్నారు. చంద్రబాబు, లోకేశ్ ను మోస్తోన్న ఎల్లో మీడియా అన్నీ అసత్య ప్రచారాలను చేస్తున్నది. వైసీపీ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది రాయకుండా, జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా రాతలు రాస్తున్నారు.
నూతన విద్యా విధానం అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది. ఈ విధానం ప్రారంభమైన తర్వాత ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతాం. ఒక్క స్కూలు కూడా మూతపడకుండానే నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తాం. ఒకే టీచరు ఉన్న స్కూళ్ల సంఖ్య 8 వేలుకాగా, నూతన విద్యా విధానంలో ఈ సమస్య పరిష్కారం లభిస్తుంది. విద్యారంగంలో జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ముందుకు వెళఉతోంది.
గత రెండేళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా 1,83,480 రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేశాం. జాబ్ క్యాలెండర్లో పోస్టుల సంఖ్య తగ్గిందని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇకపై ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. వచ్చే ఏడాది పోస్టుల సంఖ్య పెరగొచ్చు కూడా. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తోంది '' అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. కొవిడ్పై చంద్రబాబు చేయబోయే దీక్షకు అర్థం లేదనీ, కోవిడ్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో ఆయన చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications