పవన్ను అలా అనడం తప్పు కదూ: నారా లోకేష్ అభ్యంతరం
Nara Lokesh: తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ఉదయం నిర్వహించన విలేకరుల సమావేశంలో- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలు, వ్యాఖ్యలు, సెటైర్లపై తెలుగుదేశం- జనసేన పార్టీ నాయకులు ఘాటుగా స్పందిస్తోన్నారు. జగన్పై ఎదురుదాడికి దిగుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం పేరుతో ప్రతీ వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని, బడ్జెట్ గారడీతో అది బయటపడిందంటూ జగన్ విమర్శించారు.

సూపర్ సిక్స్, 143 హామీల కోసం రెండు బడ్జెట్లలో అరకొరగా కేటాయింపులు చేశారని, దీన్ని బట్టి చూస్తే అన్నిరకాలుగా ప్రజలను చంద్రబాబు మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తోందని చెప్పారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యిందని ధ్వజమెత్తారు.
ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ ఊదరగొట్టారని, చంద్రబాబు పవన్ కల్యాణ్ కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేసి అధికారంలోకి వచ్చాక ఆ హామీలు ఎగ్గొట్టేందుకు ఇప్పుడు తప్పుడు ప్రచారం, అబద్ధాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. సూపర్సిక్స్ను అమలు చేయడానికి 79,867 కోట్ల రూపాయాలు అవసరమౌతాయని, ఈ బడ్జెట్లో కేటాయించింది 17,179 కోట్లేనని గుర్తు చేశారు.
దీనిపై మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్ ఇప్పటికీ ఓటమి ఫ్రస్ట్రేషన్లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన అంగీకరించలేకపోతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడి హోదా పొందడానికి అసెంబ్లీలో కనీసం 10 శాతం సీట్లు ఉండాలని రూల్ బుక్లో స్పష్టంగా ఉందని వివరించారు.
రూల్ బుక్లో ఉన్న ఈ నిబంధనను ఉల్లంఘించి తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని జగన్ కోరుకుంటున్నారని నారా లోకేష్ చెప్పారు. ఇది చాలా అన్యాయమని విమర్శించారు. నిబంధనలను ఉల్లంఘించడం జగన్కు అలవాటేనని ఆరోపించారు. ప్రతీసారీ చట్టాన్ని ఉల్లంఘించే నేరస్తుడని ధ్వజమెత్తారు.
తమ ప్రభుత్వం కూడా నిబంధనలను ఉల్లంఘిస్తుందనే జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోందని, అలా ఎప్పటికీ జరగదని నారా లోకేష్ తేల్చి చెప్పారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా జగన్ తన ఫ్రస్ట్రేషన్ను తానే బయట పెట్టుకున్నట్టయిందని వ్యాఖ్యానించారు.
#WATCH | Amaravati: Andhra Pradesh Minister Nara Lokesh says, "The former CM (Jagan Mohan Reddy) is still frustrated. He's unable to accept the mandate that the people of Andhra Pradesh have given. If you look at the rule book, it's very clear that you need to have a minimum of… pic.twitter.com/HyWf81xLMQ
— ANI (@ANI) March 5, 2025
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని, ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. పవన్ కల్యాణ్ కార్పొరేటర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ వైఎస్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications