త్వరగా తేల్చండి ప్లీజ్ ! సుప్రీంను కోరిన జగన్ సర్కార్ - జగన్ కామెంట్స్ వేళ ప్రాధాన్యం !
అమరావతిపై సుప్రీంకోర్టు విచారణను త్వరగా చేపట్టి పూర్తి చేయాలని జగన్ సర్కార్ ఇవాళ రిజిస్ట్రార్ కు లేఖ రాసింది. జగన్ వైజాగ్ షిఫ్టింగ్ కామెంట్స్ పై రచ్చ వేళ ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీలో అమరావతినే రాజధానిగా నిర్ణయిస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ సర్కార్.. అక్కడ సత్వర విచారణ కోరుతోంది. ఇప్పటికే పలుమార్లు సత్వర విచారణ కోసం సుప్రీంకోర్టును అభ్యర్దిస్తున్న ప్రభుత్వం.. తాజాగా విచారణ వాయిదాలు పడుతున్న నేపథ్యంలో మరోసారి లేఖ రాసింది. సీఎం జగన్ తాజాగా వైజాగ్ కు షిఫ్ట్ అవుతున్నానంటూ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమంటూ సుప్రీంకోర్టుకు ప్రత్యర్ధులు లేఖలు రాస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి కీలకంగా మారింది.
సుప్రీంలో అమరావతి విచారణ
హైకోర్టు అమరావతే రాజధానిగా పేర్కొంటూ గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ సర్కార్.. దీనిపై సత్వరం విచారణ పూర్తి చేయాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఫిబ్రవరి 7న విచారణ చేపట్టేందుకు సిద్దమైంది. ఇప్పటికి విచారణ ప్రారంభమైనా విచారణ వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు రాజధాని తరలింపుకు ముహుర్తం దాటిపోయేలా ఉంది. దీంతో ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు కీలక విజ్ఞప్తి చేసింది.
ఫిబ్రవరి 6నే లిస్ట్ చేయాలని లేఖ
ఈ నెల 7న సుప్రీంకోర్టు అమరావతి పిటిషన్లపై విచారణకు సిద్దమవుతోంది. అయితే అంతకు ఒక్క రోజు ముందే అంటే ఫిబ్రవరి 6నే ఈ విచారణ లిస్ట్ చేయాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ఇన్ రికార్డ్స్ మొహఫూజ్ నజ్కీ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కు లేఖ రాశారు. ఇందులో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, రాజధాని మార్పు అధికారం అసెంబ్లీకి లేదని చెప్పిన విషయాన్ని కూడా గుర్తుచేసింది. దీంతో ఈ విచారణ త్వరగా చేపట్టి తీర్పు వెలువరించాలని ప్రభుత్వం కోరింది. తమ పిటిషన్ కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ మేరకు అనుమతించాలని కోరారు.
జగన్ కామెంట్స్ పై రచ్చ వేళ !
తాజాగా విశాఖకు షిఫ్ట్ అవుతున్నారంటూ జగన్ ఢిల్లీలో ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగానే సీఎం జగన్ అలా ఎలా చెప్తారంటూ ప్రత్యర్దులు ఆయన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ తో పాటు రిజిస్ట్రీకి కూడా దీనిపై లేఖలు కూడా రాస్తున్నారు. సీఎం జగన్ కామెంట్స్ కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, వీటిని వెంటనే పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సీజేను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధానుల పిటిషన్లను వెంటనే విచారించాలని జగన్ సర్కార్ రిజిస్ట్రీని కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.