ఏపీలో వాహనాల లైఫ్ ట్యాక్స్ వసూళ్ల వివాదం ! హైకోర్టులో జగన్ సర్కార్ సవాల్..
ఏపీలో వాహనాలకు జీవితకాల పన్ను(లైఫ్ ట్యాక్స్) వసూళ్ల వ్యవహారం మరోసారి వివాదం రేపుతోంది. వాహనాలకు రిజిస్ట్రేషన్ సమయంలో వసూలు చేస్తున్న జీవితకాల పన్ను విధించేందుకు అనుసరిస్తున్న పద్ధతిపై ఈ వివాదం నెలకొంది.దీనిపై ఇప్పటివరకూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. దీన్ని ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది.
రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పుడు వాహనాల కొనుగోలు సమయంలో దాని ఎక్స్ షోరూం ధర ఆధారంగా జీవితకాల పన్ను వసూలు చేస్తోంది. దీనిపై ఎప్పటినుంచో అభ్యంతరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలుకావడం, దీనిపై విచారణ జరగడం, ఇది సరికాదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిపోయాయి. వాహనాలకు లైఫ్ ట్యాక్స్ విధించేటప్పుడు ఎక్స్ షోరూం ధరను కాకుండా ఇన్వాయిస్ ధరను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో తీర్పు ఇచ్చింది. అదే జరిగితే ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోతుంది.

దీంతో ప్రభుత్వం వాహనాలకు లైఫ్ ట్యాక్స్ ను ఎక్స్ షోరూం ధర ఆధారంగా మాత్రమే వసూలు చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ మేరకు ఇన్వాయిస్ ధరపై మాత్రమే లైఫ్ ట్యాక్స్ విధించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, మరో న్యాయమూర్తి జస్టిస్ శేషసాయితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై ఏజీ వాదనలు వినిపించారు.
1994లోనే రాష్ట్ర ప్రభుత్వం వాహనాల ధరను పన్నులతో కలిపి లెక్కించేలా ఉత్తర్వులు జారీ చేసిందని ఏజీ శ్రీరాం హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మేరకు సింగిల్ జడ్జి వద్దే ఈ విషయం ప్రస్తావించినట్లు తెలిపారు. దీంతో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యవహారంపై గతంలో సింగిల్ జడ్జికి ఇచ్చిన అఫిడవిట్ ను తమ ముందు పెట్టాలని సూచించింది. దీనిపై ఆగస్టు 9 తదుపరి విచారణ చేస్తామని ప్రకటించింది. ఈ విచారణలో లైఫ్ ట్యాక్స్ వ్యవహారం కొలిక్కి రావొచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications