బాపట్లలో రోశయ్య కాంస్య విగ్రహం-10 లక్షలిచ్చిన జగన్ సర్కార్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, దివంగత కొణిజేటి రోశయ్య జ్ఞాపకంగా బాపట్లలో ఆయన విగ్రహం ఏర్పాటు కానుంది. ఇందుకోసం వైసీపీ ప్రభుత్వం ఆర్ధిక సాయం ప్రకటించింది. రోశయ్య సొంతూరైన బాపట్లలోని వేమూరు గ్రామంలో ఆయన కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం రూ.10 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బాపట్లలోని వేమూరులో రోశయ్య విగ్రహ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. వైసీపీలోని ఆర్యవైశ్య నేతలు ఈ మేరకు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిని జగన్ సర్కార్ ఆమోదించింది. ఈ మేరకు సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో వేమూరులో రోశయ్య కాంశ్య లేదా ఇత్తడి విగ్రహ ఏర్పాటు కోసం రూ.10 లక్షలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని సాంస్కృతిక శాఖ ఖాతా నుంచి విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వాస్తవానికి జగన్ తండ్రి వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత ప్రభుత్వంలో ఆయన తర్వాత రెండోస్ధానంలో ఉన్న రోశయ్య ను కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ప్రకటించింది. సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి ఆయన పేరును ప్రకటించేలా జగన్ ను కూడా ఒప్పించింది. అయితే అప్పటికే తన తండ్రి స్ధానంలో తనను సీఎంగా చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జగన్ సంతకాల సేకరణ చేయించారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో ఆయనకు షాక్ తగిలింది. అదే సమయంలో తన తండ్రి మరణంతో చనిపోయిన వారిని ఓదార్చేందుకు జగన్ ఓదార్పుయాత్ర తలపెట్టారు. దీనికి అధిష్టానం అంగీకరించలేదు. రోశయ్య ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకే జగన్ ఇలా చేస్తున్నారని భావించింది. దీంతో రోశయ్య సాయంతోనే జగన్ ను కట్టడి చేసే ప్రయత్నం చేసింది. దీంతో జగన్ కూ, రోశయ్యకూ మధ్య గ్యాప్ పెరిగింది. అయితే రోశయ్య జగన్ కు వ్యతిరేకంగా తీవ్ర చర్యలేవీ తీసుకోలేదు. చివరికి ఈ గ్యాప్ అలాగే మిగిలిపోయింది. రోశయ్య మరణం తర్వాత ఆయన మృతదేహాన్ని జగన్ సందర్శించలేదు. ఈ నేపథ్యంలో రోశయ్య విగ్రహానికి నిధుల విడుదల ప్రాధాన్యం సంతరించుకుంది.