ఏపీ కొత్త జిల్లాల సిత్రాలు-నిమ్మకూరు ఉన్న మచిలీపట్నాన్ని వదిలి విజయవాడకు ఎన్టీఆర్ పేరు
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం రాష్ట్రంలో కొత్త కొత్త చర్చలకు దారి తీస్తోంది. ముఖ్యంగా రాష్ట్రం నడిబొడ్డున ఉన్న విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కూడా సంచలనంగా మారింది. కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని గతంలో పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకుంటూ జిల్లాలో ఏర్పడిన రెండు జిల్లాల్లో ఒక దానికి ఆ పేరు పెట్టినా.. అసలు ఉద్దేశం నెరవేరలేదనే చర్చ జరుగుతోంది.
Recommended Video
ఎన్టీఆర్ పేరుకు జగన్ హామీ
2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా కృష్ణాజిల్లాలో అడుగుపెట్టినప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తే ఆ జిల్లాకు మాజీ సీఎం ఎన్టీఆర్ పేరు పెడతామని హామీ ఇచ్చారు. అప్పటికే స్ధానికంగా ఉన్న డిమాండ్లతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కోరిక మేరకు జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వైసీపీ నేతలు కూడా హర్షించారు. టీడీపీ సహా మిగతా పార్టీల్లోనూ చర్చ మొదలైంది. జగన్ నిజంగానే ఆ నిర్ణయాన్ని అమలు చేస్తారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి.
విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా పావులు కదిపారు. తాజాగా ఎన్టీఆర్ పుట్టిన కృష్ణాజిల్లాను రెండుగా విభజించారు. అందులో విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెండుతూ ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. అయితే రెండుగా మారిన జిల్లాల్లో ఏ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే విషయంలో మాత్రం ప్రభుత్వం పొరబాటు చేసిందా వ్యూహాత్మకంగానే అలా నిర్ణయం తీసుకుందా అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. అలాగే విజయవాడకు ఎన్టీఆర్ పేరుపై అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
నిమ్మకూరు ఉన్న మచిలీపట్నాన్ని కాదని...
ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు. ఇది బందరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆ లెక్కన చూస్తే బందరు పార్లమెంటు స్ధానం మచిలీపట్నం జిల్లాగా మారినప్పుడు దానికే ఎన్టీఆర్ పేరు పెట్టాల్సి ఉంది.కానీ జగన్ మాత్రం మచిలీపట్నాన్ని కాదని విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. తద్వారా దీనిపై కొత్త చర్చకు తావిచ్చారు. అసలు బందరును కాదని విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం వెనుక ఉన్న వ్యూహంపై సర్వత్రా భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి.
జగన్ నిర్ణయం వెనుక ?
ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ఉన్న మచిలీపట్నాన్ని కాదని విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం వెనుక జగన్ సర్కార్ కు రాజకీయంగా పలు ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులంతా విజయవాడతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోనే దశాబ్దాలుగా పాగా వేశారు. వారిని సంతృప్తి పర్చాలంటే వారి ఆరాధ్యదైవమైన ఎన్టీఆర్ పేరును విజయవాడ జిల్లాకు పెడితే బావుంటుందని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. మచిలీపట్నంతో పోలిస్తే విజయవాడలో ఉన్న కమ్మ ప్రముఖుల సంఖ్య, ప్రభావం వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.