జగన్ వెంట రోజా: శ్రీవారికి ముందే నైవేద్యం, నో డిక్లరేషన్
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారి దర్శనం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాకా చెప్పులు వేసుకు వెళ్లడం, జగన్ సిబ్బంది హడావుడి చేయడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా జగన్ కోసం భక్తుల క్యూలైన్లను గంటకు పైగా నిలిపివేశారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడాన్ని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

అంతేకాకుండా జగన్ కోసం దేవుడికి నైవేద్యాన్ని కూడా ముందే పెట్టేశారట. జగన్, ఆయన సహచరులు మహాద్వారం వద్దకు ఉదయం ఆరున్నర గంటలకు వచ్చారు. అప్పటికి అరగంట ముందుగానే అధికారులు సామాన్య భక్తులను నిలిపివేశారు. జగన్ రాకకు ముందు.. వెనుక గంటపాటు విఐపి దర్శనాన్ని కూడా ఆపేశారు. ప్రతి శని, ఆది, సోమవారాల్లో ఉదయం ఐదున్నర గంటలకు మాత్రమే శ్రీవారి నైవేద్య ఘంటానాధం మోగిస్తుంటారు.
కానీ జగన్ రాక దృష్ట్యా ఆదివారం ఉదయం ఐదు గంటల పది నిమిషాలకే మొదలు పెట్టారు. ఇది కూడా విమర్శలకు దారి తీసింది. ఉదయం ఆరున్నర గంటలకు శ్రీవారి సన్నిధికి వెళ్లిన జగన్, ఆయన అనుచరులు తిరిగి ధ్వజస్తంభం వద్దకు వచ్చి, ఆ తర్వాత రంగనాయకుల మండపంలో పండితుల వేదాశ్వీరచనం తీసుకున్నారు.

ఏడుంపావుకు ఆలయం నుండి బయటకు వచ్చారు. ఈ సమయంలో కొంత తోపులాట జరిగింది. అతిథి గృహంలో జగన్కు విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చినంత రాచమర్యాదలు చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, తాను రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని వైయస్ జగన్ అనంతరం విలేకరులతో చెప్పారు.












Click it and Unblock the Notifications