పాదయాత్రని పున:ప్రారంభించేందుకు...విశాఖపట్టణం ఎయిర్పోర్ట్కు జగన్ రాక
Recommended Video

విశాఖపట్నం:విశాఖ ఎయిర్ పోర్టులో తన పై దాడి సందర్భంగా గాయపడిన జగన్ చికిత్స నిమిత్తం పాదయాత్రకు సుదీర్ఘ విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. గాయం తగ్గిపోవడంతో సోమవారం నుంచి ప్రజా సంకల్పయాత్రని పున:ప్రారంభించేందుకు గాను జగన్ హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు బయలు దేరారు.
విజయనగరం జిల్లాలో జగన్ పాదయాత్ర నిర్వహిస్తుండగా...అక్టోబర్ 25 వ తేదీన దాడి నేపథ్యంలో భుజానికి గాయంకావడంతో 17 రోజుల విరామం అనంతరం ఆదివారం సాయంత్రం వేళకు జగన్ విశాఖ ఎయిర్ పోర్టు చేరుకోనున్నారు. జగన్ రాక నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు, వైసిపి కార్యకర్తలు భారీ సంఖ్యలో విశాఖ ఎయిర్ పోర్టు వద్దకు చేరుకున్నారు.

అక్టోబర్ 25 న విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడిపందాలకు వాడే కత్తితో శ్రీనివాస్ అనే వ్యక్తి పథకం ప్రకారం దాడి చేయగా ఎపి ప్రతి పక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భుజానికి గాయం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ హైదరాబాద్ లో చికిత్స పొందగా భుజానికి 9 కుట్లు పడ్డాయి. కుట్లు మానేందుకు, పాదయాత్ర కారణంగా గాయం మళ్లీ రేగకుండా ఉండేందుకు వైద్యుల్య సూచన మేరకు జగన్ మొత్తం 17 రోజులు విరామం తీసుకున్నారు.
అయితే నవంబర్ 12 నుంచి విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రను పునఃప్రారంభించేందుకు జగన్ సంసిద్ధమయ్యారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రం లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బయలుదేరిన జగన్...సాయంత్రం 5.30 గంటలకుఇండిగో విమానంలో విశాఖకు బయలుదేరారు. ఆ తరువాత అక్కడి నుంచి నేరుగా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పాదయాత్ర శిబిరానికి జగన్ చేరుకుంటారు.
తమ అభిమాన నేత హత్యాయత్నం నుంచి మృత్యుంజయుడిలా బైటపడ్డారని...తిరిగి తమ కష్టాలను తెలుసుకునేందుకు వస్తున్నారంటూ ఆయనకు విశాఖ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం పలికేందుకు వైసిపి కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు జగన్ పాదయాత్ర ఇప్పటికే 11 జిల్లాల్లో పూర్తయి ప్రస్తుతం 12 వ జిల్లా విజయనగరంలో కొనసాగుతుండగా మరొక్క జిల్లా శ్రీకాకుళం జిల్లా పర్యటనతో జగన్ ప్రజాసంకల్పయాత్ర ముగుస్తుంది.












Click it and Unblock the Notifications