కాపు నేస్తంతో జగన్ తేనె తుట్టె కదిపారా ? మళ్లీ తెరపైకి ఆ సమస్య- పవన్ కు వరమవుతుందా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్ కాపు నేస్తం పథకం రాష్ట్రంలో ఉన్నా లేనట్లుగా మారిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తిరిగి ప్రాణం పోస్తుందా ? గతేడాది వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక సమస్యను లేవనెత్తిన పవన్ ఆ తర్వాత చిన్నా చితకా సమస్యలకే పరిమతమవుతున్న వేళ.. సీఎం జగన్ కాపు నేస్తం రూపేంలో పవన్ కు ఓ ఛాన్స్ ఇచ్చారా ? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే చర్చ నడుస్తోంది. కాపు నేస్తం పథకం ద్వారా మహిళలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చేస్తున్న వాదనను వారి అభివృద్ధితో ముడిపెట్టి పవన్ ప్రశ్నించడం మొదలుపెడితే జగన్ సర్కారు ఇరుకున పడటం ఖాయం.
ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు- వైసీపీ నుంచి రక్షించాలని కేంద్రానికి వేడుకోలు...
వైఎస్సార్ కాపు నేస్తం పథకం...
ఏపీలో 45 నుంచి 60 ఏళ్ల వయసున్న పేద కాపు మహిళలకు ఏటా రూ.15 వేల రూపాయల సాయం అందించేలా వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని జగన్ సర్కారు ప్రారంభించింది. కాపులు ఓసీల్లో భాగంగా ఉండటం, మిగతా పథకాల ద్వారా వారికి ఎలాంటి లబ్ది లేకపోవడంతో జగన్ సర్కారు ఎన్నికల హామీ మేరకు దీన్ని తీసుకొచ్చింది. అయితే ఏడాది పాలన తర్వాత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంలో లబ్ది దారుల సంఖ్యతో పాటు మిగతా లెక్కలను ప్రకటిస్తూ జగన్ చేసిన ప్రకటన ఇప్పుడు విపక్షాలకు ఓ వరంగా మారేలా కనిపిస్తోంది. కాపులకు గత ఏడాది కాలంలో వివిధ పథకాల ద్వారా రూ.4770 కోట్ల రూపాయల లబ్ది చేసినట్లు జగన్ తెలిపారు. దీంతో ఇప్పుడు విపక్షాలు వాటి లెక్కలను తీసే పనిలో పడ్డాయి.
కాపులకు బిస్కెట్లా.. పవన్ సీరియస్..
వైసీపీ ప్రభుత్వం కాపు నేస్తం పథకం ద్వారా ఈ ఏడాది రూ.354 కోట్ల సాయం చేస్తోంది. దీంతో పాటు మిగిలిన పథకాల్లోనూ కాపులు లబ్దిదారులుగా ఉన్నారన్నఅంశాన్ని చూపుతూ 23 లక్షల మంది కాపులకు రూ.4770 కోట్ల లబ్ది జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ఇదే అంశం విపక్షాలకు వరంగా మారింది. ప్రభుత్వ ప్రకటన రాగానే టీడీపీ, జనసేన స్పందించాయి. అయితే జనసేనాని పవన్ మాత్రం ఈ అంశాన్ని కాపు రిజర్వేషన్లతో ముడిపెడుతూ చేసిన విమర్శలు కచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేవే. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకునేందుకే ప్రభుత్వం రూ.4770 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పుకుంటోందని, చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
రిజర్వేషన్ల డిమాండ్ తో వైసీపీకి ముచ్చెమటలు...
కాపులకు రిజర్వేషన్ డిమాండ్ పవర్ ఏంటో గత టీడీపీ ప్రభుత్వం స్వయంగా చూసింది. అదే సమయంలో కాపు రిజర్వేషన్లు తన చేతిలో లేవంటూ కామెంట్ చేసిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల సమయంలో ఎదుర్కొన్న నిరసన అంతా ఇంతా కాదు. చివరికి రిజర్వేషన్ల కోసం తన ప్రయత్నం చేస్తానంటూ హామీ ఇచ్చి జగన్ అప్పట్లో బయటపడ్డారు. అయితే కాపునేస్తం పథకం అమల్లోకి వచ్చిన సందర్భంగా పవన్ రిజర్వేషన్ల డిమాండ్ తెరపైకి తీసుకురావడంతో జగన్ సర్కార్ ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్ధితి. కాపు నేస్తం పథకాన్ని ప్రచారం చేసుకుంటే సరిపోయే దానికి రూ.4770 కోట్లతో అన్ని పథకాలు అందిస్తున్నామని చెప్పడం ద్వారా రిజర్వేషన్ల డిమాండ్ తెరపైకి రాకుండా ప్రభుత్వం జాగ్రత్తపడుతోందని పవన్ వ్యాఖ్యానించడం జగన్ సర్కారుకు ఇబ్బందిగా మారింది.
Recommended Video
పవన్ కు అవకాశమిచ్చారా ?
ఏపీలో సుదీర్గంగా పోరాటం చేయగల ప్రజా సమస్యలు కనిపించకపోవడంతో దాదాపుగా హైదరాబాద్ కు పరిమితమవుతున్న పవన్ కళ్యాణ్.. కాపులకు రిజర్వేషన్ల అంశంపై స్వరం పెంచితే జగన్ సర్కారుకు సమస్యలు తప్పకపోవచ్చు. అన్నింటికంటే మించి పవన్ కాపు అజెండాను బీజేపీ కూడా సమర్ధిస్తే మరిన్ని చిక్కులు తప్పవు. గతంలో ఎన్నికలకు ముందు కాపుల రిజర్వేషన్లతో పాటు ఇతర అజెండా అమలు కోసం అదే సామాజిక వర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముందుకొచ్చారు. వివిధ కారణాలతో అప్పట్లో అది అమలు కాకపోయినా ఈసారి అధికారంలో ఉన్న వైసీపీపై కాపు రిజర్వేషన్ అజెండాతో వీరు దాడి మొదలుపెడితే మళ్లీ ముద్రగడ తరహా ఉద్యమాలూ తప్పకపోవచ్చు. అయితే ఈ సమస్యను జగన్ సర్కార్ ఎలా టాకిల్ చేస్తుందో అనే చర్చ మాత్రం సాగుతోంది.