జగన్ ట్రాప్ లో చిక్కుకున్న తెలుగుదేశం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పాచిక విసిరారు. అందులో తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తం చిక్కుకొని గిలగిలలాడుతోంది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తీసేసి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్య విశ్వవిద్యాలయంగా ప్రభుత్వం మార్చింది. అంతే టీడీపీ నాయకులు దీనిపై ఒక్కసారిగా భగ్గుమన్నారు. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తాము అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ పేరు పెడతామని స్పష్టం చేశారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాతే పార్టీ యంత్రాంగానికి తత్వం బోధపడింది.
కర్ర విగరకుండా.. పాము చావకుండా..
ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పేరు మార్పునకు సంబంధించిన విషయమే చర్చకు వస్తోంది. అంతకుముందు చర్చకు వస్తూ ప్రధానంగా ఉన్న సమస్యలన్నీ ఈ వార్త ధాటికి అట్టడుగుకు వెళ్లిపోయాయి. డైవర్షన్ పాలిటిక్స్ అని కొందరు అన్నారు. అలా అంటుండగానే మరికొందరు జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.
ఆ తర్వాత జూనియర్ దీనిపై స్పందించి ట్వీట్ చేశారు. ఒకరి పేరు తీయడంవల్ల ఆ పేరుకు ఉన్న ప్రతిష్ట దెబ్బతినదని, మరొకరి పేరు పెట్టడంవల్ల వారి ప్రతిష్ట పెరగదన్నారు. అయితే ఆయన చేసిన ట్వీట్ అనుకున్నంత స్థాయిలో లేదని, కర్ర విగరకుండా, పాము చావకుండా ట్వీట్ చేశారని టీడీపీలోనే ఒక వర్గం భగ్గుమంది.
జూనియర్ ఎన్టీఆర్ కు అనుకూలంగా.. వ్యతిరేకంగా..
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్తావన తెచ్చారని, అవన్నీ అవసరంలేదని, అనుకున్నంతస్థాయిలో స్పందించలేంటూ వారు మండిపడ్డారు. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నప్పటికీ చంద్రబాబుకు దూరంగా మెలిగే నాయకులు, కార్యకర్తలు కొందరు జూనియర్కు మద్దతు పలుకుతున్నారు.
తాను ఉన్న పరిస్థితులకు తగ్గట్లుగా హుందాగా మెలిగారని, ఆయన చేసిన ట్వీట్ బాగుందని మద్దతు పలికారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోనే రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మెలిగేవారు, అనుకూలంగా మెలిగేవారుగా విడిపోయారు. సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు.
అసలు విషయం మరిచిపోయిన తెలుగు తమ్ముళ్లు
వాస్తవానికి పేరు మార్చిన ప్రభుత్వాన్ని మరిచిపోయి వాదులాడుకుంటున్నారు. అక్కడే జగన్ వ్యూహం అద్భుతంగా పనిచేసిందని కొందరు రాజకీయ విశ్లేషకులు విశ్లేషించారు. జూనియర్ ను వ్యతిరేకించేవారంతా లోకేష్ కు అనుకూలంగా పోస్ట్ లు చేస్తున్నారు. మధ్యేమార్గం కొందరు తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇదంతా ముఖ్యమంత్రి జగన్ డ్రామా అని, ఆ ట్రాప్ లో చిక్కుకోవద్దంటూ పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనాకానీ జగన్ ట్రాప్ లో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చిక్కుకుపోయినట్లు మాత్రం అర్థమవుతోంది. వారు ఎప్పుడు బయటపడతారో చూడాలి.