జైరాంకు హీట్: సినీ పరిశ్రమపై కెటిఆర్, జగన్కు విహెచ్
హైదరాబాద్/విశాఖపట్నం: కేంద్రమంత్రి జైరామ్ రమేష్ రాకను సొంత పార్టీ కార్యకర్తలే వ్యతిరేకిస్తుండటంతో విశాఖ విమానాశ్రయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం పరిసరాల్లో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. జైరామ్ రమేష్ రాకను నిరసిస్తూ కాంగ్రెసు నేతలు, సమైక్యవాదులు, తెలుగుదేశం పార్టీ నేతలు విశాఖ విమానాశ్రయం వద్ద నిరసన చేపడుతున్నారు.
సమైక్యవాదులు, టిడిపికి తోడు సొంత పార్టీ వారే నిరసన వ్యక్తం చేస్తుండటంతో బాలరాజు, ద్రోణంరాజు ఇతర నేతలు సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే, విభజనకు కారకులైన జైరామ్ రమేష్ను తాము అడుగు పెట్టనిచ్చేది లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జైరాంను అడ్డుకోవాల్సిందేనని బాలరాజు, ద్రోణంరాజులకు కార్యకర్తలు సూచించారు. జైరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పార్టీలోనే కొనసాగుతా: వట్టి
తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ సోమవారం వేరుగా చెప్పారు. కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
సినీ పరిశ్రమ సీమాంధ్రకు తరలి వెళ్లదు: కెటిఆర్
విభజన నేపథ్యంలో సినిమా పరిశ్రమ సీమాంధ్రకు తరలి వెళ్లబోతుందంటూ వస్తున్న వార్తలపై తెరాస ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. హైదరాబాదులో సినిమా పరిశ్రమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పరిశ్రమ హైదరాబాదు వదిలి వెళ్లకుండా తాము తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
జగన్పై విహెచ్ ఫైర్
కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. ఆయన సోమవారం గవర్నర్ నరసింహన్ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం నుండి షర్మిలను పోటీ చేయించాలనుకోవడం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమే అన్నారు. తిరుమలలో జగన్ తీరుపై ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. కిరణ్ సర్కారు ఆఖరులో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష నిర్వహిస్తానని గవర్నర్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు.












Click it and Unblock the Notifications