30 మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి: జలీల్, ఫిర్యాదుపై జగన్ ట్వీట్
ఢిల్లీ/విజయవాడ: వచ్చే నెలలో (మే నెల) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో 30 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. ఆయన ఇటీవలే వైసిపి నుంచి టిడిపిలో చేరారు. ఆయన మాట్లాడారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొంటోందని చెప్పడం సరికాదన్నారు. ఎమ్మెల్యేలు అంటే జగన్కు చులకన భావం అన్నారు. రెండేళ్లలో జగన్ ప్రజా సమస్యల పైన పోరాడ లేదని విమర్శించారు. పదవి కోసమే జగన్ ఆరాటపడుతున్నారని ఆయన ఆరోపించారు. తాము అభివృద్ధి కోసమే సైకిల్ ఎక్కుతున్నామన్నారు.
జగన్ ట్వీట్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన మంగళవారం ఉదయం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిశారు. ఆ తర్వాత కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకుంటున్న విషయాన్ని ఆయన జాతీయ నేతల దృష్టికి తీసుకు వెళ్లారు. ఇదే విషయమై ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు. అనైతికంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకుంటున్న విషయాన్ని జాతీయ నాయకులకు వివరించామన్నారు.
కాగా, ఏపీలో టిడిపి అప్రజాస్వామిక రాజకీయాలు చేస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుందని ఆరోపిస్తూ సేవ్ డెమోక్రసీ పేరుతో వైయస్ జగన్ నేతృత్వంలో ప్రజాప్రతినిధుల బృందం జాతీయ నేతలను కలుస్తోంది. జగన్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు.