జగన్! గుర్తుంచుకో, నిద్రలేకుండా చేస్తాం, ఢిల్లీలో టీడీపీ పట్ల అలాగేనా: జనసేన వార్నింగ్
అమరావతి/హైదరాబాద్: తమ పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలపై జనసేన తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ ప్రతినిధులు మాట్లాడారు. జనసేన ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రతినిధులు అద్దేపల్లి శ్రీధర్, పార్థసారథిలు హైదరాబాద్ జనసేన కార్యాలయంలో మాట్లాడారు.
ఎన్నికల టైంలో రూ.3వేలు ఇస్తే 5వేలు అడగండి: జగన్, పవన్ కళ్యాణ్పై సెటైర్
పవన్ ఎప్పుడో ఓసారి బయటకు వస్తారని, ఆయన సినిమా తక్కువ, ఇంటర్వెల్ ఎక్కువ అంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన స్పందించింది. జగన్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. పవన్ ప్రజలతోనే ఉన్నారని స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ శాసన సభను వదిలారని, తద్వారా ప్రజా సమస్యలను పక్కన పెట్టారన్నారు.
జగన్! ఈ విషయం గుర్తుంచుకో
పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాణ నిలుస్తున్నారని చెప్పేందుకు అవిశ్వాస తీర్మానమే నిదర్శనం అని జనసేన ప్రతినిధులు చెప్పారు. ఈ విషయంలో వైసీపీకి, టీడీపీకి సూచన చేసింది పవన్ అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అందుకే ఇన్నాళ్లు అవిశ్వాసం పేరుతో ఢిల్లీలో చర్చ జరిగిందని అభిప్రాయపడ్డారు.
వైసీపీ ఎంపీలకు సంఘీభావం
ప్రత్యేక హోదా అంశంపై పోరాడేవాళ్లందరికీ జనసేన అండగా ఉంటుందని చెప్పారు. ఢిల్లీలో రాష్ట్రం కోసం నిరసనలు, ఆమరణ దీక్షలు చేస్తున్న ఎంపీలకు సంఘీభావం చెబుతున్నట్లు తెలిపారు. హోదా కోసం వైసీపీ ఎంపీలు నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారని, వయస్సులో పెద్దవారైన ముగ్గురు ఎంపీలు ఇప్పటికే ఆసుపత్రిలో చేరారని గుర్తు చేశారు.
టీడీపీ ఎంపీల పట్ల ఇలాగేనా?
టీడీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద నిరసనలు తెలియజేస్తే, వారిని అరెస్టు చేసిన తీరు గౌరవప్రదంగా లేదని జనసేన వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని కేంద్రాన్ని, పోలీసులను ప్రశ్నించింది. ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న టీడీపీ, వైసీపీలకు తాము సంఘీభావం తెలుపుతున్నామన్నారు.
రాజీనామాలు చేయాల్సింది అప్పుడు
తాము ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతూనే, టీడీపీ, వైసీపీలు చేసిన పొరపాట్లను కూడా చెబుతున్నామన్నారు. పార్లమెంటు నిరవధిక వాయిదాపడిన తర్వాత వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడం సరికాదన్నారు. సభ వాయిదా పడిన తర్వాత అవి ఎప్పుడు ఆమోదం పొందాలన్నారు. సభ నడుస్తున్న సమయంలోనే రాజీనామాలు చేయవలసి ఉండెనని చెప్పారు.
పవన్ కళ్యాణ వెంటే ప్రజలు
ఏపీకి హోదా, విభజన హామీల విషయంలో న్యాయం జరగాలంటే లోకసభ, రాజ్యసభ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు అందరు రాజీనామా చేయాలని జనసేన ప్రతినిధులు అన్నారు. పవన్ ఒక్క పిలుపు ఇస్తే విజయవాడలో పాదయాత్రకు 40వేల మంది వచ్చారన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల పాదయాత్రలు చేశారని, పవన్ వెంటే ప్రజలు ఉన్నారని, వారి వెంట జనసేనాని ఉన్నారని చెప్పారు.
పవన్ కళ్యాణ్ పాదయాత్రకు
పవన్ కళ్యాణ్ పాదయాత్రకు పిలుపు ఇచ్చిన తర్వాతే చంద్రబాబు హడావుడిగా సైకిల్ యాత్ర అన్నారని జనసేన ఎద్దేవా చేసింది. చంద్రబాబు, లోకేష్లు చేసిన యాత్రను ప్రజలు చూశారన్నారు. ఇదే సమయంలో వారు బీజేపీపై నిప్పులు చెరిగారు. హోదా, విభజన హామీల విషయంలో బీజేపీ వెనుకడుగు వేస్తోందన్నారు. బీజేపీని నిలదీయడంలో టీడీపీ, వైసీపీ విఫలమయ్యాయని, ఆ రెండు పార్టీలు కేసుల భయంతో బీజేపీని గట్టిగా అడగటం లేదన్నారు. హోదా, హామీల కోసం జనసేన పోరాడుతుందన్నారు. తమ కార్యాచరణతో టీడీపీ, వైసీపీలకు నిద్రలేకుండా చేస్తామన్నారు.