జనసేనకు ఆదిలోనే దెబ్బ: తిరగబడతామని వార్నింగ్, అప్పుడే చెప్తే బాగుండన్న పవన్, కుట్రనా?
అమరావతి: గుంటూరు జిల్లా చినకాకానిలో జనసేన పార్టీ కార్యాలయానికి కమ్యూనిస్ట్ నేత యార్లగడ్డ సుబ్బారావు మూడు ఎకరాల భూమిని లీజుకు ఇచ్చారు. గురువారం ఈ భూమిపై వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల జనసేనానీ ఏపీలో పర్యటించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఆయన చినకాకానిలో జనసేన కార్యాలయం కోసం భూమిని పరిశీలించిన విషయం తెలిసిందే. 3 ఎకరాల 42 సెంట్ల స్థలాన్ని జనసేన కార్యాలయం కోసం పవన్ కళ్యాణ్ లీజుకు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయానికి భూమిని లీజుకు ఇచ్చిన వ్యక్తి కాళ్లకు పవన్ పాదాభివందనం కూడా చేశారు.

జనసేన కార్యాలయం లీజు
కానీ లీజుకు తీసుకున్న రోజుల్లోనే వివాదం తెరపైకి వచ్చింది. వివాదంలో ఉన్న భూమిని పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నారని, అసలు ఆ కార్యాలయం తమది అని ఓ ముస్లీం కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు పవన్కు విజ్ఞప్తి చేసింది.

వివాదంలో ఉన్న భూమిలో నిర్మాణాలు చేపట్టొద్దు
ఆ స్థలం తమది అని షేక్ షపీ కుటుంబం చెబుతోంది. తమ స్థలాన్ని అక్రమంగా జనసేన కార్యాలయం కోసం సుబ్బారావు లీజుకు ఇచ్చారని ఆరోపించారు. వివాదంలో ఉన్న భూమిలో నిర్మాణాలు చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు. లేదంటే తిరగబడతామని హెచ్చరించారు.

1920 నుంచి మా ఆదీనంలో, 1981 నుంచి వివాదం
1920 నుంచి ఈ భూమి తమ ఆదీనంలో ఉందని ఆ కుటుంబం వాపోయింది. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చి విషయం చెప్పింది. 1981 నుంచి ఈ భూమి విషయంలో వివాదం కొనసాగుతోందని చెప్పారు.

ఇదీ జరిగింది
సర్వే నెంబర్ 182/1లో ఉన్న భూమిని జనసేన లీజుకు తీసుకుందని చెప్పారు. 1997లో గుంటూరు కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెప్పారు. అయితే సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్టేటస్ కో ఇచ్చిందని చెప్పారు.

ముస్లీం ఐక్య వేదిక
కాగా, చినకాకాని వద్ద పార్టీ కార్యాలయం నిర్మించేందుకు జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య భూమి హక్కుదారులతో అవగాహన ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ కుటుంబం సుబ్బారావుది కాదని, తమది అని ఓ ముస్లీం ఫ్యామిలీ చెప్పడంతో పాటు వారికి ముస్లీం ఐక్య వేదిక అండగా నిలిచింది.

అప్పుడే చెప్తే ఇంత దూరం వచ్చేది కాదు
కాగా, జనసేన కార్యాలయ స్థల వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. అజుమన్ ఇస్లామిక్ ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. తాను వచ్చినప్పుడే చెబితే ఇంత దూరం వచ్చి ఉండేది కాదన్నారు. ఒక రాజకీయ నేతతో కలిసి ఈ విషయమై మీడియాకు చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇది రాజకీయ కుట్ర అయితే కనుక ఎదుర్కొనే శక్తి తమకు ఉందని స్పష్టం చేశారు. త్వరలో జనసేన నిపుణులతో కలిసి తాను చినకాకాని వస్తానని చెప్పారు. స్థలం వివాదాస్పదమైతే లీజు రద్దు చేసుకుంటామని తెలిపారు. స్థలం విషయంలో జనసేనకు దురుద్దేశ్యాలు లేవన్నారు.












Click it and Unblock the Notifications