ప్రధాని చెబితే అంతే: లక్నోలో హోదాపై పవన్ కళ్యాణ్, ఆ పార్కులో నడిచిన రెండో వీఐపీ
లక్నో/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం లక్నోలో పలు ప్రాంతాలను సందర్శించారు. నగరంలోని డాక్టర్ బీంరావ్ అంబేడ్కర్ సామాజిక పరివర్తన ప్రతీక్ స్థల్ (అంబేడ్కర్ స్మారక పార్కు)ను సందర్శించారు. ఈ పార్క్ 107 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

జనసేనాని నడక
ఈ పార్కులో జనసేననాని కాలినడకన సందర్శించారు. ఇలా కాలి నడకన నడిచిన రెండో ప్రముఖుడు పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని అక్కడి అధికారులు తెలిపారు. మొదటగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ సందర్శించారని తెలిపారు. పవన్ వెంట మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తదితరులు ఉన్నారు.

పార్లమెంటులో ఒక మాట చెబితే
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఓసారి ప్రధానమంత్రి పార్లమెంటులో ఒక మాట చెబితే అది శాసనంతో సమానమని, దానిని అమలుచేసి తీరాల్సిందేనని చెప్పారు. ఇప్పటి రాజకీయ నేతల్లో అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ విలువల స్ఫూర్తి లోపించిందని, మాటను నిలబెట్టుకోవడం గురించి ఎవరూ ఆలోచించడం లేదని విమర్శించారు.

జవాబుదారీతనంతో కూడిన రాజకీయాలు
తాము జవాబుదారీతనంతో కూడిన రాజకీయాల వైపు వెళ్తున్నామని పవన్ చెప్పారు. కాన్షీరామ్, నారాయణ్గురు, సాహు మహరాజ్, పూలే లాంటి సంఘ సంస్కర్తలే తాను రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి ప్రదాతలని చెప్పారు. అంబేడ్కర్కు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసునేందుకు ఈ పర్యటన దోహదపడిందన్నారు. బలహీనవర్గాలను పైకి తేవాలన్నదే తమ ప్రధాన అజెండా అన్నారు.

పుష్పాంజలి ఘటించారు
వివిధ రాష్ట్రాల్లో పార్టీలు అనుసరిస్తున్న పోకడలను పరిశీలిస్తున్నట్లు పవన్ తెలిపారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లక్నోలో ఆయన పలువురు నేతలతో కలిసి బుధవారం అంబేడ్కర్ పార్కును సందర్శించారు. అక్కడ గ్యాలరీలు, మ్యూజియాన్ని తిలకించి, మహనీయుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. తనను కలిసేందుకు వచ్చిన విద్యావేత్తలతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications