సీఎంగా జగన్ వద్దు.. పవనే కావాలి.. లేకుంటే చచ్చిపోతామన్న రైతులు
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ నిరసనలు చేస్తోన్న రైతులకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంఘీభావం తెలిపారు. మంగళవారం అమరావతి ప్రాంతంలో పర్యటించిన ఆయన రైతులతో మమేకమై వారి గోడు విన్నారు. ఎర్రబాలెంలోని దీక్ష శిబిరంలో రైతులతో కలిసి బైఠాయించారు. రాజధాని అంశం రోజురోజుకూ వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో పవన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్ దీక్ష శిబిరానికి పెద్ద ఎత్తున మహిళలు తరలిరావడం గమనార్హం.

మహిళల భావోద్వేగం
రాజధాని తరలింపు వల్ల తాము ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నది రైతులు పవన్ కల్యాణ్ కు వివరించారు. ఈక్రమంలో కొందరు మహిళలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ప్రజల్ని మోసం చేస్తున్నాడని, స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు దొరకకుండా పారిపోయారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్యాయాలు జరుగుతున్నాయని, ప్రజలు బాధలు తీరారంటే పవనే ముఖ్యమంత్రి కావాలని మహిళలు నినాదాలు చేశారు.

మా వరకు జగన్ సీఎం కానేకాడు
‘‘రాజధాని అమరావతిలోనే ఉండాలి.. రైతులుకు న్యాయం జరగాలి.. అలా కావాలంటే నువ్వు ముఖ్యమంత్రి కావాలి.. నీలాంటోడు అందరికీ కావాలి.. నువ్వు సీఎం కాకుంటే మేం ఇక్కడే చచ్చిపోతాం.. ఈ జగన్ మాకు వద్దేవద్దు.. మా వరకు ఆయన ముఖ్యమంత్రి కానేకాడు.. మమ్మల్ని మోసం చేసిన జగన్ వెంటనే దిగిపోవాలి.. జీవితంలో ఏరోజూ బయటికి రాని మహిళలం ఇవాళ రోడ్లమీదికొచ్చాం.. 13 రోజుల నుంచి ఇంటిల్లిపాది అన్నం మానేసి దీక్షలు చేస్తున్నాం.. ''అంటూ మహిళలు ఆవేశపూరితంగా మాట్లాడారు.

క్లారిటీ ఇచ్చేదాకా కదిలించొద్దు..
అమరావతిలో పర్యటించిన జనసేనాని పవన్ కల్యాణ్.. రాజధాని అంశంలో తన పార్టీ స్టాండ్ ను ప్రకటించారు. అమరావతి రైతులకు న్యాయం చేస్తామనే క్లారిటీ ఇవ్వకుండా రాజధానిని కదిలిస్తే ఊరుకునే ప్రశ్నే ఉండదని, ఒకవేళ ప్రభుత్వం అలా చేస్తే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానని హెచ్చరించారు. జనసేన పార్టీ అన్నీ ప్రాంతాల డెవలప్మెంట్ ను కోరుకుంటుందని స్పష్టం చేశారు. జగన్ సర్కారు ఉద్దేశపూర్వకంగా ప్రాంతీయ విద్వేషాలు కల్పించి.. ప్రజల్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నదని, అధికారం శాశ్వతం అనుకున్నవాళ్లందరూ కూలిపోకతప్పదని పవన్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications