జనసేన ఎమ్మెల్యే రాపాక పై వేటు: పవన్ కళ్యాణ్ నిర్ణయం: వైసీపీతో సంబంధాలే..!
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ మీద వేటు పడింది. ఆయన తీరు పట్ల పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన సమయం నుండి అధికార పార్టీతో సన్నిహితం గా వ్యవహరిస్తున్నారు. దీని పైన పార్టీ నుండి పలుమార్లు సూచనలు వచ్చినా ఆయన ఖాతరు చేయలేదు. ముఖ్యమంత్రి జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయటం..పార్టీ అధినేత పవన్ విభేదించిన అంశాల్లో వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు.
తాజాగా..మూడు రాజధానుల విషయంలో పార్టీ నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రతిపాదనను సభలో వ్యతిరేకించాలని నేరుగా పవన్ కళ్యాణ్ తమ ఎమ్మెల్యే రాపాక కు లేఖ రాసారు. అయినా రాపాక మాత్రం తన పాత ధోరణిలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే..ముఖ్యమంత్రి పైన ప్రశంసలు కురిపించారు. దీని పైన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో నిర్ణయించిన తరువాత రాపాక నుండి జనసేన నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో...
2019 ఎన్నికల్లో జనసేన నుండి రాపాక ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలిచిన తరువాత ఒకటి రెండు సందర్భాల్లోనే ఆయన జనసేన పార్టీ లైన్ లో వ్యవహరించారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనే ఆయన ప్రత్యేకంగా ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. అప్పటి నుండి ఆయన తీరులో మార్పు కనిపించింది . ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ వస్తున్నారు.

అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా
ఇసుక వ్యవహారంలోనూ..ఇంగ్లీషు మీడియం విషయంలోనూ అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. పార్టీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అధికార పార్టీకి మద్దతుగా నిలిచారు. పార్టీ నిర్వహించిన సమావేశాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. కొంత కాలంగా ఆయన తీరు పైన జనసేన అధినేత మాత్రం వేచి చూసే ధోరణితో వ్యవహరించారు. కానీ, తాజాగా మూడు రాజధానుల విషయంలో రాపాక తీరుపైన ఆగ్రహంతో ఉన్న పవన్ ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీకి అనుబంధంగా..
ఇప్పుడు జనసేన తనను సస్పెండ్ చేయటంతో..ఇక రాపాక సైతం వైసీపీకి అనుబంధ సభ్యుడగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మూడు రాజధానుల వ్యవహారంలో పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని పవన్ సూచించారు. సభలోనే ముఖ్యమంత్రితో ఇదే అంశం పైన ఆయన చర్చించినట్లుగా సమాచారం.

పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో
సభలో ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. ఇదే విషయం పైన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించారు. సభ్యులంతా రాపాక పైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో..పవన్ కళ్యాన్ రాపాక పైన వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇప్పుడు రాపాక టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వంశీ..గిరి బాటలోనే అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications