మోడీకి పవన్ థ్యాంక్స్ : నెల్లూరు-ప్రకాశం నేషనల్ హైవేపై ఎయిర్ స్ట్రిప్ కేటాయించినందుకు..
దేశవ్యాప్తంగా రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై 29 చోట్ల యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా ఎయిర్ స్ట్రిప్ లను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాజస్తాన్ లోని బార్మర్ లో తొలి ఎయిర్ స్ట్రిప్ ను ఈ మధ్యే విజయవంతంగా పరీక్షించింది కూడా. ఇదే కోవలో ఏపీలోనూ నెల్లూరు-ప్రకాశం జాతీయ రహదారిపై ఓ స్ట్రిప్ కేటాయించింది.
ఏపీలోని నెల్లూరు-ప్రకాశం జాతీయ రహదారిపై కేంద్రం ఎయిర్ స్ట్రిప్ ను కేటాయించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై నిర్మిస్తున్న ఎయిర్ స్ట్రిప్లలో ఏపీకి కూడా ఒకటి కేటాయించడంతో హర్షం వ్యక్తం చేశారు. జాతీయ మాల పథకంలో భాగంగా కేంద్రం ఏపీకి ఎయిర్ స్ట్రిప్ కేటాయించడం సంతోషించదగిన విషయంగా ఆయన అభివర్ణించారు.

దేశ భద్రత, ప్రకృతి వైపరీత్యాల వల్ల తలెత్తే అత్యవసర పరిస్ధితుల్లో ప్రజలను ఆదుకోవడానికి రహదారులపై సైతం విమానాలు దిగేలా నిర్మాణాలను చేపట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికీ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అభినందనలు అంటూ పవన్ ట్వీట్లో పేర్కొన్నారు. జాతీయ మాల పథకంలో భాగంగా రాజస్ధాన్ లోని బార్మర్ లో నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ తలమానికంగా నిలుస్తోందని, ఈ విశిష్ట పథకాన్ని ఏపీలో కూడా అమలు చేస్తున్నందుకు తెలుగు ప్రజల తరఫున కృతజ్ఞతలు అంటూ పవన్ ట్వీట్లో తెలిపారు.
ఏపీలో మిత్రపక్షం బీజేపీతో ఈ మధ్య అంటీ ముట్టనట్టుగా ఉంటున్న పవన్ కళ్యాణ్.. తాజాగా ప్రధాని మోడీ ఏపీకి ప్రకటించిన పథకానికి ధన్యవాదాలు తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు నెరుపుతున్నా రాష్ట్రంలో సోము వీర్రాజు మినహా మిగిలిన బీజేపీ నేతలతో దూరంగా ఉంటున్న పవన్ ఇవాళ ప్రధానిని పొగుడుతూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతోంది. ఇదే కోవలో పవన్ .. రాష్ట్రంలో బీజేపీ చేపట్టే కార్యక్రమాల్లోనూ పాలుపంచుకోవాలని స్ధానిక నేతలు కోరుతున్నారు. మరి పవన్ ఈ డిమాండ్లపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Hon. PM Sri @narendramodi ji @PMOIndia pic.twitter.com/l1QUZ5bIVx
— Pawan Kalyan (@PawanKalyan) September 16, 2021












Click it and Unblock the Notifications