బెస్ట్ బిఫోర్ యూజ్ ఇన్ One Week?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా సమీకృతం చేసి వైసీపీని గద్దె దింపుతానని ఆవేశంగా ప్రకటిస్తున్నారు. సినిమాల్లో కథానాయకుడికి ఉండే దూకుడును ఆయన రాజకీయాల్లో కూడా చూపిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమనేది పవన్ లక్ష్యంగా ఉంది.

లోపించిన నాణ్యమైన రాజకీయం
ఇటువంటి తరుణంలో ఒక ప్రతిపక్ష నేతగా జాగ్రత్తగా వ్యవహరించాలి. నాణ్యమైన రాజకీయం చేయాలి. ముఖ్యంగా రాజకీయ నేతలంటే మాటమీద నిలబడేవారు కాదు అనేది ఎప్పటినుంచో ఉన్న వాక్కు. రాజకీయాలను మారుస్తానంటూ వచ్చిన పవన్ కల్యాణ్ కూడా ఆ రాజకీయాల్లో భాగమైపోయారు. మాట నిలబెట్టుకోలేకపోతున్నారు. ఫక్తు రాజకీయ నాయకుడి మాదిరిగా అవుతుండటంతో జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయాల్లో నాణ్యత లోపించిందని పదే పదే చెప్పే పవన్ కల్యాణ్ తన మాటలోను, డైలాగుల్లోను నాణ్యత కొరవడుతోందనే విషయాన్ని గమనించడంలేదు.

నా యుద్ధం నేనే చేస్తా..
విశాఖ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు.. ఆ తర్వాత మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి రావడం.. విజయవాడలోని హోటల్ లో చంద్రబాబుతో కలిసి మీడియా సమావేశం.. తర్వాత విజయనగరంలో పర్యటనకు వెళ్లారు. అక్కడ జనసేనాని మాట్లాడిన మాటలు రాజకీయ విమర్శకులనే ఆశ్చర్యంలో పడేశాయి. రానున్న ఎన్నికల్లో ఒంటరి యుద్ధమేనని ప్రకటించారు. అప్పటికే విశాఖలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవడంకూడా అయింది. బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం పవన్ తన మాటలను మార్చారని అందరూ అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ లేకుండా జనసేన-బీజేపీ కలిసి వెళతాయని భావించారు. తన యుద్ధం తానే చేసుకుంటానని, ఒకరికి ఊడిగం చేయబోనని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. దీంతో జనసేనాని ఒకే మార్గంలో వెళుతున్నారంటూ తటస్తులు, కొందరు మేథావులు, కొందరు రాజకీయవేత్తలు జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

అన్ని శక్తులను ఒకేవేదికపైకి తెస్తా..
ఈలోగా సత్తెనపల్లిలో కౌలు రైతులకు పరిహారం అందజేసేందుకు సత్తెనపల్లి వచ్చిన పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా చూస్తానని, రాజకీయ శక్తులన్నింటినీ ఒకే వేదికపైకి తెస్తానని, వ్యూహం తనకు వదిలేయాలని ప్రకటించారు. దీంతోపాటు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పొత్తులపై త్వరలోనే స్పష్టత ఇస్తామని ప్రకటించారు. ఒకసారి ఒంటరిగావెళుతున్నానంటారు.. మరోసారి అన్ని శక్తులను ఏకీకృతం చేస్తున్నానంటారు.. అసలు ఏ దిశగా పవన్ వెళ్లాలనుకుంటున్నారు? లేదంటే ఇదంతా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? ఏ ఒక్క స్టేట్ మెంట్ ను కనీసం వారం రోజులు కూడా నిలుపుకోలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. తడబడుతున్నారు అనుకోవడానికి పార్టీ పెట్టి 10 సంవత్సరాలవుతోంది.. తడబడే అవకాశం లేదు.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అనేదానిపై స్పష్టత లేదు. ఈ గందరగోళానికి ముగింపునివ్వకపోతే భవిష్యత్తులో ప్రజల నుంచే వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాను చెప్పేవి వ్యూహాత్మకం అవునా? కాదా? అనేదానిపై పవన్ వివరణ ఇస్తే ప్రజలకే కాకుండా రాజకీయ వర్గాలకు కూడా ఒక స్పష్టత వస్తుంది.












Click it and Unblock the Notifications