జనసేనాని పవన్ కల్యాణ్ నియోజకవర్గం ఖరారు? సర్వే పూర్తి!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో పోటీచేసే నియోజకవర్గం దాదాపుగా ఖరారైంది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీచేసి ఓటమిపాలవడం ఆ పార్టీ శ్రేణనులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈసారి ఆరు నూరైనా తమ నేత అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని, 175 నియోజకవర్గాల్లోని ప్రతి నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని జనసేన నాయకులు, కార్యకర్తలు నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే నియోజకవర్గాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించాయి.

జనసేనకు బలంగా పిఠాపురం
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి ఈసారి బరిలోకి దిగబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేయాలనే యోచనలో మొదటి నుంచి జనసేనాని ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 25వేల ఓట్లకు తక్కువ కాకుండా జనసేన సాధించింది. తెలుగుదేశం పార్టీ ఓటమిపాలు కావడానికి ఇది కూడా ఒక కారణం. అయితే ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో ఉన్న పవన్ బీజేపీ లేకుండానే తెలుగుదేశం పార్టీతో పొత్తులకు సమాలోచనలు జరపుతున్నారు.

పలు ఛానెళ్ల సర్వే
పిఠాపురం నియోజకవర్గంలో పలు యూట్యూబ్ ఛానళ్లు సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో స్థానికులంతా పవన్ గత ఎన్నికల్లోనే ఇక్కడి నుంచి పోటీచేసి ఉండాల్సిందని, గెలిపించుకునేవారిమని చెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన మాకినీడు శేషుకుమారి భారీగా 28 వేల ఓట్లు సాధించారు. 151 సీట్లు సాధించిన జగన్మోహన్రెడ్డి హవాలో కూడా ఆమె అన్ని ఓట్లు సాధించడం అద్భుతంగా పరిగణించారు రాజకీయ విశ్లేషకులు.

పటిష్ఠంగా జనసేన యంత్రాంగం
పిఠాపురంలో జనసేన బలోపేతంగా ఉంది. వార్డు వార్డుకు, గ్రామ గ్రామానికి కార్యకర్తల యంత్రాంగం ఉంది. యువత ఆయనవైపే ఉంటారు కాబట్టి విజయానికి ఢోకా లేదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇక్కడి ఎంపీటీసీ స్థానాన్ని ఆ పార్టీనే కైవసం చేసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి పవన్ పోటీచేసే పరిస్థితి ఏమిటి? అనే విషయం తెలుసుకోవడానికే యూట్యూబ్ ఛానెళ్లతో సర్వే నిర్వహింపచేసినట్లుగా భావిస్తున్నారు.

పిఠాపురంలో పోటీచేస్తే అన్ని నియోజకవర్గాలపై ప్రభావం
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ప్రజలతో దూరంగా ఉండటమే ఇందుకు కారణమని జనసేన వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మకు గెలుపు అవకాశాలున్నప్పటికీ పవన్ బరిలోకి దిగితే రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతాయని భావిస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీచేస్తే ఆ ప్రభావం కాకినాడ అర్బన్, రూరల్, పెద్దాపురం, తుని తదితర నియోజకవర్గాలపై ఉంటుందని, వీరంతా విజయం సాధించడానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications