జగన్ సొంత ఇలాకాలో పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తారా, ఇదీ లెక్క?: టీడీపీ బలం పెరుగుతోందా?
కడప: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల గెలుపోటములను పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ప్రభావితం చేస్తుందని చాలామంది భావిస్తున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం తదితరచోట్ల జనసేన ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని భావిస్తున్నారు.
అవి సరైనవేనని రుజువైంది: కేంద్ర బడ్జెట్పై చంద్రబాబు, లేని రైల్వేజోన్ ప్రస్తావన
కడపలో జనసేన ప్రభావం
వచ్చే ఎన్నికల్లో జనసేన కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేయనుంది. జనసేన బలానికి తోడు స్థానికంగా బలం ఉన్న లెఫ్ట్ పార్టీలు కలుస్తున్న కారణంగా టీడీపీ, వైసీపీల గెలుపోటములపై కచ్చితంగా ప్రభావం ఉంటుందని అంటున్నారు. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను జనసేనాని మారుస్తారని భావిస్తున్నారు. ఇందులో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకా.. కడప జిల్లాలోను వీరి ప్రభావం కనిపిస్తుందని, పలువురి జాతకాలు తారుమారు చేసే అవకాశముందని చెబుతున్నారు.
పీఆర్పీ కంటే జనసేన ప్రభావం ఎక్కువ
2009లో కడపలో ప్రజారాజ్యం పార్టీ ప్రభావం బాగానే కనిపించింది. ఉదాహరణకు కోడూరు నియోజకవర్గంలో నాడు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన సామినేని సరస్వతి 22వేల పై చిలుకు ఓట్లు సాధించారు. కడప అసెంబ్లీ నుంచి పీఆర్పీ తరఫున పోటీ చేసిన అఫ్జల్ అలీఖాన్ 13వేల ఓట్లు సాధించారు. పులివెందులలో మాత్రం ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వేలురూ చిన్న గంగిరెడ్డికి మూడున్నర వేలకు పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి. 2009లో కొన్ని చోట్ల పీఆర్పీ ఓట్లు చీల్చడంతో కాంగ్రెస్ తక్కువ మార్జిన్తో సీట్లు గెలిచందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నమని చెబుతున్నారు. జనసేన బలం పీఆర్పీ కంటే ఎక్కువ అంటున్నారు.
టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయా?
నాడు ప్రజారాజ్యం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఇప్పుడు జనసేన.. లెఫ్ట్ పార్టీతో కలిసి పోటీ చేయనుంది. పైగా పీఆర్పీ కంటే జనసేన బలం ఎక్కువ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలను పక్కన పెడితే కడపకు, పులివెందులకు టీడీపీ నీరు ఇవ్వడం, 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి గెలవడం, క్రమంగా టీడీపీ బలం పెరుగుతుందనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జగన్కు టీడీపీ గట్టి పోటీ ఇస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. టీడీపీ మరింత ముందుకు వెళ్లి.. పులివెందులలో జగన్ను ఓడిస్తామని చెబుతోంది.
జనసేనాని షాక్ చంద్రబాబుకా, పవన్ కళ్యాణ్కా?
ఇలాంటి పరిస్థితుల్లో లెఫ్ట్ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన కడప జిల్లాల్లో ప్రభావం చూపుతుందని, ఆ నష్టం టీడీపీకి జరుగుతుందా లేక వైసీపీకి జరుగుతుందా అనే చర్చ సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుతారా అనే విషయాన్ని పక్కన పెడితే కడపలో మాత్రం జగన్ వ్యతిరేక ఓటును చీల్చుతారని, అది వైసీపీకి లాభమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అలా కాకుండా వైసీపీ ఓటును చీల్చితే సొంత జిల్లాలో జగన్కు గట్టి షాక్ తప్పదని అంటున్నారు.
ఇలాంటి చోట్ల జనసేన బలం కీలకం
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓ చోట టీడీపీ కేవలం 1.43 శాతం ఓట్ల మార్జిన్తో ఓడిపోయింది. టీడీపీ అభ్యర్థి సుబ్బరామయ్యకు 64వేలకు పైగా ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శ్రీనివాసులుకు 66వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇలాంటి చోట్ల జనసేన ప్రభావం కీలకం కానుందని అంటున్నారు. అలాగే, టీడీపీ, వైసీపీలో సీట్ల కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఈ ప్రభావం కూడా పడుతుందని చెబుతున్నారు. కోడూరులో వైసీపీకి ఓటు బ్యాంకు లేదని, ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆ పార్టీలోకి వెళ్లినందున స్వల్ప మెజార్టీతో గెలిచారని అంటున్నారు. జనసేన కనుక వైసీపీ ఓట్లను చీల్చితే ఇలాంటి సీట్లు టీడీపీకి వెళ్తాయని అంటున్నారు.