టీడీపీ, జనసేన పొత్తులో కొత్త ట్విస్టు - లోకేశ్ సీటు పై గురి, అల్టిమేటం..!!
ఏపీలో పొత్తుల రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీ, జనసేన పొత్తు లాంఛనమే. రెండు పార్టీల నుంచి ఆశావాహులు తమ సీట్లు ఖరారు చేసుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది స్పష్టత రాలేదు. ఆ పార్టీ కూడా జత చేరితే సీట్ల కోసం పోటీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కు టీడీపీ షాక్ ఇస్తే..ఇప్పుడు జనసేన కౌంటర్ రాజకీయం ప్రారంభించింది. టీడీపీ నేత లోకేష్ కు పోటీగా కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చింది.
పొత్తు పంచాయితీ : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీతో పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ నేతలతో మంతనాలు చేసారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో చర్చలు జరిపారు. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావటం లేదు. బీజేపీ నిర్ణయం కోసం వేచి చూస్తూనే..ఇటు టీడీపీ, జనసేన ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి.

జనసేనాని పవన్ ఈ నెల 14వ తేదీ నుంచి వారాహి ద్వారా ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించారు. ముందుగా గోదావరి జిల్లాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. ఇదే సమయంలో రెండు పార్టీల నుంచి అసెంబ్లీ పోటీ ఆశావాహుల తమ సీట్ల కోసం ప్రకటనలు చేస్తున్నారు. సీట్లు తమకే ఇవ్వాలని డిమాండ్లు మొదలు పెట్టారు.
లోకేశ్ సీటు పై జనసేన గురి : టీడీపీ ముఖ్య నేత నారా లోకేశ్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో తిరిగి మంగళగిరి నుంచి పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ముందునుంచి అక్కడ పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనికి కౌంటర్ గా వైసీపీ అక్కడ చేనేత వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ మాజీ మంత్రి మురుగుడుకు ఎమ్మెల్సీ పదవి.. టీడీపీ మాజీ నేత గంజి చిరంజీవికి చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టింది.
లోకేష్ ఈ సారి తన గెలుపు పైన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు మంగళగిరి సీటు తమ పార్టీకే ఇవ్వాలని జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాస రావు డిమాండ్ చేశాడు. తాను మొదటి నుంచి ఇదే అడుగుతున్నానని చెప్పారు. నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం వారు బలంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

టిక్కెట్ ఇవ్వకుంటే : తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలని మొదటి నుంచి ఆశిస్తున్నట్లు చిల్లపల్లి వెల్లడించారు. ఒకవేళ పార్టీకి టికెట్ ను కేటాయించని పక్షంలో భవిష్యత్తు పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకుంటానని అల్టిమేటం జారీ చేసారు. ఆ తర్వాత మేయర్ టిక్కెట్ కూడా ఇవ్వాలని అభ్యర్థిస్తామని తెలిపారు. ఇప్పటికే ఇదే జిల్లాలో తెనాలి సీటు పైన నాదెండ్ల మనోహర్ ఆశలు పెట్టుకున్నారు.
తానే పోటీ చేస్తానని ప్రకటించారు. తాజాగా టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తాను తెనాలి నుంచి బరిలో ఉంటానని వెల్లడించారు. దీనికి కౌంటర్ అన్నట్లుగా లోకేష్ సీటు తమకు ఇవ్వాలంటూ జనసేన నేతలు ముందుకు వచ్చారు. దీంతో, పొత్తు అధికారికంగా ఖరారు కాకముందే రెండు పార్టీల నుంచి వస్తున్న సీట్ల డిమాండ్లతో పొత్తు రాజకీయం..సీట్ల సర్దుబాటు మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications