లోకంలోనే మొదటి 'ట్రిలియనీర్'. ప్రపంచాన్ని శాసించబోతున్న ఒకే ఒక్కడు!
ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన నేతృత్వంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్ఎక్స్' (SpaceX) తాజాగా నిర్వహించిన 75 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి ఐపీఓ (IPO) మస్క్ సంపదను ఆకాశానికి చేర్చింది. శుక్రవారం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత ఆయన నికర ఆస్తి విలువ అక్షరాలా 1.1 ట్రిలియన్ డాలర్లను (లక్ష కోట్ల డాలర్లకు పైగా) (భారత కరెన్సీలో అక్షరాలు రూ.104 లక్షల 50 వేల కోట్లు) దాటేసిందని ఫోర్బ్స్, రాయిటర్స్ సంస్థలు స్పష్టం చేశాయి. ఆర్థిక చరిత్రలో ఇంతటి భారీ సంపదను కూడబెట్టిన మొదటి వ్యక్తిగా ఎలాన్ మస్క్ నిలిచారు.
ఈ ఐపీఓ కంటే ముందు మస్క్ ఆస్తి 780 బిలియన్ డాలర్లుగా ఉండేది. ప్రస్తుత కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న గూగుల్ (ఆల్ఫాబెట్) సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ కంటే మస్క్ చాలా ముందంజలో ఉన్నారు. ఈ విషయంపై ఫోర్బ్స్ వెల్త్ డిప్యూటీ ఎడిటర్ మాట్ డురోట్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడి ఆస్తి కేవలం 300 బిలియన్ డాలర్ల వరకే ఉంది. అంటే మస్క్ సంపాదించబోయే మొత్తంలో అది మూడో వంతు కూడా లేదు" అని పేర్కొనడం మస్క్ రేంజ్ను చెప్తోంది.

ఏంటి ఈ 'ఎలాన్ ప్రీమియం'?
మార్కెట్ విశ్లేషకులు మస్క్ చుట్టూ ఉన్న వ్యాపార నెట్వర్క్ను 'మస్కోనమీ' అని పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే 'ఎలాన్ ప్రీమియం' అనే కొత్త పదం పుట్టుకొచ్చింది. సాధారణంగా ఏ కంపెనీకైనా లాభనష్టాలు, సాంప్రదాయ ఆర్థిక లెక్కలను బట్టి షేర్ల విలువ పెరుగుతుంది. కానీ మస్క్ కంపెనీల విషయంలో అలా కాదు. స్పేస్ఎక్స్ టెక్నాలజీలు పూర్తిగా లాభాల్లోకి రావడానికి చాలా ఏళ్లు పడుతుందని తెలిసినా ఇన్వెస్టర్లు వేల కోట్లు పెట్టడానికి సిద్ధపడతారు. దీనికి కారణం కేవలం ఎలాన్ మస్క్ విజన్, ఆయన ఐడియాల మీద ఉన్న గుడ్డి నమ్మకమే.
"టెస్లా లాగే, స్పేస్ఎక్స్ కూడా మస్క్ మీద వేసే ఒక పెద్ద పందెం. లాభనష్టాల లెక్కలతో సంబంధం లేకుండా ఈ కంపెనీకి 1.5 ట్రిలియన్ నుంచి 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ వస్తోందంటే.. దాన్ని కేవలం 'ఎలాన్ మస్క్ ప్రీమియం' అని మాత్రమే అనగలం" అని రెనైసాన్స్ క్యాపిటల్ స్ట్రాటజిస్ట్ మాట్ కెన్నెడీ వివరించారు.
సౌత్ ఆఫ్రికా నుంచి మొదలైన ప్రస్థానం
ప్రస్తుతం 54 ఏళ్ల వయసున్న ఎలాన్ మస్క్ ప్రయాణం ఎంతో ఆసక్తికరమైనది. దక్షిణ ఆఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించిన మస్క్.. 1997లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందారు. 2008లో టెస్లా సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలక్ట్రిక్ కార్లు కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలవని ప్రపంచానికి నిరూపించారు.
టెస్లా విజయంతో ప్రపంచంలోని మిగతా పెద్ద కార్ల కంపెనీలు కూడా ఈవీ (EV) వైపు అడుగులు వేయక తప్పలేదు. టెస్లాతో పాటు భూగర్భ రవాణా కోసం 'ది బోరింగ్ కంపెనీ', బ్రెయిన్ ఇంప్లాంట్ తయారు చేసే 'న్యూరాలింక్' వంటి ఐదు విభిన్న కంపెనీలను ఆయన స్థాపించారు. ఆటోమోటివ్ రంగంలో అమెరికన్ మేధస్సుకు మస్క్ ప్రపంచ గౌరవాన్ని తెచ్చారని జనరల్ మోటార్స్ మాజీ వైస్ చైర్మన్ బాబ్ లూట్జ్ కొనియాడారు.
రాజకీయం, వివాదాలు.. మన కాలపు ఎడిసన్!
ఎలాన్ మస్క్ అంటే కేవలం వ్యాపారమే కాదు.. వివాదాలకు కూడా ఆయన కేరాఫ్ అడ్రస్. 2022లో 44 బిలియన్ డాలర్లు పెట్టి ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్ - X) కొనుగోలు చేసిన తర్వాత ఆయన ప్రభావం మరింత పెరిగింది. రాజకీయాలు, వాక్ స్వాతంత్ర్యం, ప్రభుత్వ వ్యయం వంటి అంశాలపై ఆయన చేసే పోస్టులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో 'డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ' (DOGE) లో ఆయన చేరడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రాజకీయ పరిణామాల వల్ల 2025లో అంతర్జాతీయ మార్కెట్లలో టెస్లా కార్ల బహిష్కరణ వంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి.
అలాగే 2018లో ఆయన తీసుకున్న 56 బిలియన్ డాలర్ల భారీ శాలరీ ప్యాకేజీపై ఇన్వెస్టర్ల నుంచి విమర్శలు వచ్చాయి. అయినా సరే, మస్క్ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడా తగ్గలేదు. గతంలో మస్క్ను తీవ్రంగా విమర్శించిన జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జేమీ డైమన్ సైతం ఆ తర్వాత రూట్ మార్చి.. "ఎలాన్ మస్క్ మన కాలపు థామస్ అల్వా ఎడిసన్.. ఆయనొక ఐన్స్టీన్" అని ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్ని వివాదాలు, రాజకీయ ఒడిదుడుకులు ఉన్నా ఎలాన్ మస్క్ ఆధునిక ప్రపంచాన్ని శాసించే ఒక అనివార్య శక్తిగా మారారు. ప్రపంచపు మొదటి ట్రిలియనీర్గా నిలిచిన మస్క్.. భవిష్యత్తును ఏ తీరాలకు తీసుకెళ్తారో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.














Click it and Unblock the Notifications