రేపటి కేబినెట్ భేటీకి పవన్ గైర్హాజరు ? జనసేన కీలక ప్రకటన..!
ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు జరిగే ఏపీ కేబినెట్ భేటీకి హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరిగే కేబినెట్ భేటీకి పవన్ కళ్యాణ్ రాకపోవచ్చని జనసేన పార్టీ కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేసింది. దీనికి గల కారణాలను కూడా ఆ ప్రకటనలో జనసేన నేతలు వెల్లడించారు. దీంతో రేపటి కేబినెట్ భేటీ తొలిసారి పవన్ లేకుండానే జరిగే అవకాశముంది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ సమస్య కూడా ఆయన్ను బాధిస్తోంది. దీంతో డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకొంటున్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఆరోగ్య సమస్యల కారణంగా రేపు జరిగే కేబినెట్ భేటీకి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవచ్చని ప్రకటించింది. దీంతో పవన్ కేబినెట్ కు హాజరు కావడం కష్టమని తెలుస్తోంది.
ఈ మధ్య ఆరోగ్య కారణాలతో పవన్ తరచుగా అధికారిక కార్యక్రమాలకు దూరమవుతున్నారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కు డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో సమీక్షలకు కూడా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ భేటీకి కూడా హాజరుకాకుండా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేబినెట్ భేటీకి వెళ్తే కనీసం మూడు, నాలుగు గంటలు అయినా సమావేశంలో కూర్చోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్న పవన్ అంత సమయం కేబినెట్ భేటీలో కూర్చొనే పరిస్ధితి లేకపోవడంతో డాక్టర్ల సూచన మేరకు గైర్హాజరు అవుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications