మళ్లీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య, చంద్రబాబుపై యూటర్న్, జగన్పై సెటైర్
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బుధవారం నాడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బుధవారం నాడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎవరికి టికెట్లిస్తే వారే గెలిచారని, తెలుగుదేశంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఏమైనా మహాత్మా గాంధీయా అని తాను అనలేదని స్పష్టం చేశారు. తన మాటలు అధికారులు వినడం లేదన్న ఆందోళన లేదని, తనకు అధికారులంతా సరైన గౌరవమర్యాదలు ఇస్తారని చెప్పారు.
అనంతపురం ఫ్లైఓవర్ విషయంలో పంతానికి పోవడం లేదన్నారు. మీడియా వాళ్లు నారదమునులని, చాలామంది అలాంటి వారే ఉండడంతో మాటలు మారిపోతున్నాయన్నారు. జేసీ దివాకర్ రెడ్డి ఫలానా పని చేశాడన్న పేరు తెచ్చుకోవాలన్న కోరిక తనకు ఉందని తెలిపారు.

మంత్రి పరిటాల సునీత ఇంత వరకు తనకు వ్యతిరేకంగా ఎలాంటి పని చేయలేదని, కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదన్నారు. తనకు సంచలన కామెంట్లు చేయాలన్న ఆలోచన, కోరిక ఉండదని చెప్పారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడతానని తెలిపారు.
తెలంగాణ విడిపోవడానికి ఓ సామాజిక వర్గం కారణం
తెలంగాణ విడిపోవడానికి తమ సామాజిక వర్గానికి చెందినవారే కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణల్లో బతికి బట్టకట్టడం కల్ల అన్నారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉందని, ఒకసారి కోమాలోకి వెళ్తే బతికే అవకాశాలు కష్టమన్నారు. కాంగ్రెస్ కూడా అంతేనన్నారు.
జగన్కు కౌంటర్
తమ పార్టీకి చంద్రబాబు తల అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు కాళ్లు, చేతులన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఎంతసేపూ మహానేత అంటూ చెబుతుంటే సరిపోతుందా? అని ఎద్దేవా చేశారు. విమర్శలు చేయడం మాత్రమే కాదని, వాటికి పరిష్కారాలు కూడా చెప్పాల్సి ఉందన్నారు.
మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడడండి అంటే, కంపుకొడుతుందన్నారు. ఎంతసేపూ పట్టిసీమ, పోలవరం, ఇతర సమస్యల మీద విమర్శలు కురిపించడమే కాకుండా పరిష్కారం ఏం చేస్తావో చెప్పాలన్నారు.
అలా కాకుండా ఎంతసేపూ అధికార పక్షం మీద విమర్శలు చేస్తే గెలిచేస్తామని అనుకోవడం భ్రమే అవుతుంద్నారు. తమ సామాజిక వర్గం జవసత్వాలు ఉడిగిపోయాయని, తమకు సెలైన్ ఎక్కిస్తే సరిపోదని, దేవతలు పానం చేసినది ఉండాలని, అది తన వద్ద లేదన్నారు.












Click it and Unblock the Notifications