బాబుకు తెలుసు: జెసి సంచలనం, పవన్ పోరు చేస్తే రెడీ, జగన్ దీక్ష చేసినా..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా రాదనే విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూడా తెలుసునని ఆయన అన్నారు. టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన శనివారంనాడు ప్రత్యేక హోదాపై కుండబద్దలు కొట్టారు.
ప్రత్యేక హోదా అంటే ఏమిటో ఎవరికి సరిగా అర్థం కాలేదని, వారికి తెలియదని అంటూ చెప్పాలంటే వాస్తవానికి ప్రత్యేక హోదా ఏమిటో పూర్తిగా తనకు కూడా అర్థం కాలేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై అధికారంలో లేనప్పుడు ఒక విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్సించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా ప్రత్యేక హోదా రావాలని ఉందని, తాము అయ్యా.. స్వామీ.. చెప్పుకున్నామని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేసినా ప్రత్యేక హోదా రాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజలంతా చిన్నవాళ్ల నుంచి 90 ఏళ్ల వృద్ధురాలి వరకు ప్రత్యేక హోదా కావాలని అంటున్నారని ఆయన అన్నారు.

ప్రజలంతా ఏకకంఠంతో బజారున పడినా కేంద్ర ప్రభుత్వం పలకడం లేదని, ప్రజల గొంతుకు ప్రాధాన్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ పోరాడితే ఆయన వెంట నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జెసి చెప్పారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అని చెబుకుంటున్నప్పటికీ ప్రజల గొంతుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
తనకు కేంద్రం మనసు అర్థమైందని, ఎపికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఆ విషయం తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నిధులు రాబట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా రాదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పుడో అర్థమైందని, రాదనే విషయం చంద్రబాబుకు తెలియంది కాదని ఆయన అన్నారు. ప్రజల మాటను స్వీకరించాలని, వారి మాట గురించి ఆలోచిద్దామనే ఇంగిత జ్ఞానం ప్రభుత్వాలకు లేదని ఆయన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications