కేటీఆర్.. తగ్గొద్దు! మా రాష్ట్రం పనైపోయింది: జగన్.. రాజారెడ్డి వద్దేనంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఆ వ్యాఖ్యలను ఎందుకు వెనక్కి తీసుకున్నారోనని, ఆయన వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదని టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ గురించి కేటీఆర్ చెప్పినదాంట్లో అంతా నిజమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

కేటీఆర్.. తగ్గొద్దంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ మాట జారానని చెబుతున్నా.. ఏపీలోని వాస్తవాలనే చెప్పారని అన్నారు. ఏపీలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ సమస్యలపై ఫొటోలు తీసి పంపడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఏపీ పరిస్థితులపై చెప్పి మాట మాత్రం వెనక్కి తీసుకోవద్దని కేటీఆర్కు సూచించారు. కేటీఆర్కు మద్దతుగా తాను ఉంటానన్నారు. కేటీఆర్తో కలిసి ఏపీ పరిస్థితులపై ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శిస్తున్నప్పుడు.. కేటీఆర్ మాటల్లో తప్పేముందని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.

కేటీఆర్ ఫ్యూచర్ లీడర్.. తానే భయపడటం లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి
మాకు రోడ్లు లేవు. నీరు లేవు... నిజమే. మా రాష్ట్రం పరిస్థితి అంతా అయిపోయింది. నాకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ వెళ్లే రోడ్లు చాలా బాగున్నాయి. మీరు తగ్గద్దు. కేటీఆర్ మాట తప్పద్దు. మీరు ఫ్యూచర్ లీడర్. నువ్వు మాట్లాడింది నిజమే. దాన్నుంచి వెనక్కి తగ్గద్దు. నేను నిజంగానే అన్నాను.. టంగ్ స్లిప్ కాలేదని చెప్పమని సలహా ఇచ్చారు జేసీ. తమ వ్యాపారాలను నడవకుండా చేశారని.. అయినా తాను భయపడటం లేదని.. కేటీఆర్ ఎందుకు భయపడాలని అన్నారు.

జగన్ రాజారెడ్డి దగ్గరే పెరిగారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి
కాగా, రాష్ట్రంలో మీరు లేరా? అంటూ తల్లి సరిగా పెంచలేదన్న హోంమంత్రి వ్యాఖ్యలపై జేసీ మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి సరిగా పెంచడం కుదరక తాత దగ్గర జగన్ పెరిగారు. అందుకే ఇలా అని వ్యాఖ్యానించారు. అయితే, పెద్దాయన్ని(రాజశేఖర్ రెడ్డి) ఏం అనవద్దు. ఆయన బాగానే పెంచారన్నారు. మంత్రులు ఏపీలో ఏం చేయలేరు. సంతకాలు మాత్రం పెడతారు. 2018 ప్రబోదానంద కేసులో ఇప్పటికీ అమాయకులను చేర్చుతున్నారని జేపీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. జిల్లా ఎస్పీ చేతిలో ఏమీ లేనట్లుందని, ప్రభుత్వ సలహాదారు సజ్జల కనుసన్నల్లోనూ పనిచేస్తున్నట్లు ఉందని అన్నారు. ఎస్పీని కలిసి వచ్చాను. ఆయన మంచోడు. ఆయన చేతిలో ఏంలేదు. సజ్జల చేతిలో అంతా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

బీజేపీలో చేరతారా? అన్న ప్రశ్నకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నారంటే?
తాను బీజేపీలోకి వెళతారన్న వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తనకు రావాల్సిన పార్టీలోనే టికెట్ వస్తుందన్నారు. తాను పార్టీమారేది వుంటే ముందే చెబుతామన్నారు. బీజేపీ నేతలు తమ ఇంటికి వచ్చారని, తాను ఎక్కడికి వెళ్లలేదన్నారు. పరిచయం ఉండటంతోనే వారు వచ్చారన్నారు. తనకు పార్టీలు మారాల్సిన అవసరం లేదని, రాజకీయాలే అవసరం లేదనుకుంటున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications