దుకాణం యజమానిని బెదిరిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి?
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ ఛైర్మన్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యానికి దిగారు. అనంతపురం నగరం సుభాష్రోడ్డులో స్థానిక నందిని హోటల్కు ఎదురుగా సర్వే నెంబరు 15/144లో ఒక దుకాణం ఉంది. 2000 సంవత్సరంలో దీన్ని బాబయ్య అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. 2010లో బాబయ్య ఆ షాపును జేసీ ట్రావెల్స్ కు ఇచ్చారు. 12 సంవత్సరాలుగా ట్రావెల్స్ వారు అద్దె చెల్లించడంలేదని ఆ షాపు యజమాని మల్లికార్జున ఆచారి తెలిపారు. అనంతపురం నగరంలోని పాతూరులో ఆచారి నివసిస్తుంటారు. 2010 నుంచి 2022 ప్రస్తుత నెల వరకు ఒక్క రూపాయి కూడా అద్దెకు ఇవ్వలేదని వాపోయారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే 'స్పందన' కార్యక్రమంలో ఈమేరకు జేసీపై ఆచారి స్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. ఖాళీ చేయమని కోరుతుంటే దౌర్జన్యానికి దిగుతున్నారని, షాపు పగలగొడతా.. మర్డర్ చేస్తానంటూ బెదిరిస్తున్నారన్నారు. తన ఇద్దరు కుమారులు నిరుద్యోగులని, వారిచేత ఏదైనా వ్యాపారం పెట్టించాలన్న ఉద్దేశంతో ఖాళీ చేయమని కోరుతుంటే స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. షాపును ఖాళీ చేయించి న్యాయం చేయాలని, లేదంటే కుటుంబ సభ్యులంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామని కన్నీటి పర్యంతమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలతోపాటు దుందుడుకు చర్యల ద్వారా తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు.