మోదీ వస్తున్నారు.. ఇకపై అమరావతి అభివృద్ధి అన్ స్టాపబుల్: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి అభివృద్ధి పైన ప్రస్తుతం అందరి ఆసక్తి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి నిర్మాణాల పునః ప్రారంభానికి రానున్న క్రమంలో రాజధాని అమరావతి పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక ఇదే క్రమంలో విట్ యూనివర్సిటీలో వి లాంచ్ ప్యాడ్ 2025 స్టార్టప్ ఎక్స్పోకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి అభివృద్ధి పైన కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు
అమరావతి అభివృద్ధి అన్ స్టాపబుల్ అని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. వైజాగ్ లో గూగుల్ సెంటర్ వస్తుందని, కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి కానుందని రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతుందన్నారు. ప్రధాని నేతృత్వంలో మేకిన్ ఇండియా ముందుకు సాగుతుందని చంద్రబాబు తెలిపారు. దేశ అభివృద్ధిలో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తుందని, సాంకేతికతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు వరుసలో నిలవాలని, అందుకు తగిన కృషి జరుగుతుందని చంద్రబాబు తెలిపారు.

కర్నూలులో డ్రోన్ సిటీ నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో దేశంలోని కీలకమైన డ్రోన్ సిటీ నిర్మాణం చేస్తున్నామని, సాటిలైట్ కూడా ఇక్కడి నుంచి పంపే ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. విద్యార్థులందరూ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో అమరావతికి భూములు సేకరించామని, 29 వేల మంది రైతులు అమరావతికి భూములు ఇచ్చారని, వాళ్ళు కొందరినైనా దత్తత తీసుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
స్వర్ణాంధ్ర 2047 రోడ్ మ్యాప్ సిద్ధం
మే రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి వస్తున్నారని చంద్రబాబు మళ్లీ అమరావతి పనులు పునః ప్రారంభం అవుతాయని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని, విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఏం చేయాలో అది చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్ ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దామని చంద్రబాబు, ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు ట్రెండ్ సెట్ చేశారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఐదుచోట్ల రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ లు
అమరావతి విట్ లో 95% ప్లేస్మెంట్స్ వస్తున్నాయని, అయితే ఉద్యోగాలు చేసి సంతృప్తి పడవద్దని, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరంతా ఎదగాలని విద్యార్థులను ఉద్దేశించి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదుచోట్ల రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏఐకి భవిష్యత్తు ఉందని, విద్యార్థులు దాని మీద ఫోకస్ చేయాలన్నారు.
కాశ్మీరులో ఉగ్రదాడిని ఖండించిన చంద్రబాబు
ఇక ఇదే సమయంలో కాశ్మీరులో ఉగ్రదాడిని ఖండించిన చంద్రబాబు భారత్ తో పెట్టుకుంటే ఎవరైనా మటాష్ అయిపోవాల్సిందే అని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలంతా సంఘటితం కావలసిన అవసరం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications