ప్యాకేజీ హోదాకు సరి రాదు, తలుచుకుంటే ఇవ్వొచ్చు: జెపి
ఎపికి ప్రత్యేక హోదాపై లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ గొంతు విప్పారు. బిజెపి తలుచుకుంటే హోదా ఇవ్వవచ్చునని అన్నారు.
హైదరాబాద్: బిజెపి తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చునని లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. యువత చేస్తున్న ఈ పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. ఫేస్బుక్ వేదికగా ఆయన ప్రత్యేక హోదాకు సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించారు.
ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదని కేంద్రం చెబుతోందని, దీన్నే ప్రధాన అడ్డంకిగా చూపుతోందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ విషయం అసలు సమస్యే కాదని ఆయన చెప్పారు. ప్రధాని పార్లమెంట్లో ఇచ్చిన హామీకి చట్టబద్ధత ఉంటుందని, కుదరని పక్షంలో కాంగ్రెస్తో పాటు 16 పార్టీల మద్దతు ఉన్నందు వల్ల బీజేపీ తలచుకుంటే ఇప్పుడు విభజన చట్టానికి సవరణ చేయడం కష్టమేమీ కాదని ఆయన అన్నారు.

నూటికి నూరుపాళ్లు బీజేపీ, కాంగ్రెస్ ఆనాడు ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్రం హోదాకు సమానమైన ప్యాకేజి ఇచ్చామని చెప్పుకుంటోందని, అందులో ఎలాంటి వాస్తవం లేదని ఆయన ఆయన అన్నారు. ప్రత్యేక హోదా వల్ల 100 శాతం ఐటీ పన్ను మినహాయింపు, కార్పొరేట్ పన్ను మినహాయింపు, ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ సుంకం మినహాయింపు లభిస్తుందని ఆయన చెప్పారు.
ముప్పై శాతం క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ ఎలవెన్స్ పొందవచ్చునని తెలిపారు. కరెంటు బిల్లుల పైన 50 శాతం రాయితీ కల్పించవచ్చునని అన్నారు. ప్యాకేజీ వల్ల ఆశించిన రీతిలో పెట్టుబడులు వస్తాయని కేంద్రం చెబుతోందని, అయితే ఇంతవరకూ ఆ ప్యాకేజీకి చట్టబద్ధతే లేదని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications