చంద్రబాబుకు జూ ఎన్టీఆర్ సెగ - ఇక తప్పదా : ఓన్లీ పవన్ అయితే - ఎన్నికలపై ఎఫెక్ట్..!?
టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. పార్టీని సిద్దం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. ఏపీలో గెలుపు కోసం అటు పవన్..ఇటు బీజేపీతో పొత్తుల దిశగా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబుకు కొత్త సమస్య వెంటాడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సెగ తగులుతోంది. ఏపీతో పాటుగా ఇప్పుడు తెలంగాణలోనూ తారక్ సీఎం అంటూ అభిమానులు చంద్రబాబు సభలో నినాదాలు చేస్తున్నారు. తాజాగా ఖమ్మం సభలో ఇదే తరహా పరిస్థితి చోటు చేసుకుంది. పవన్ తో పొత్తు ప్రయత్నాల వేళ..తారక్ అభిమానులు తమ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. దీంతో, ఇప్పుడు చంద్రబాబు టీడీపీలో తారక్ ప్రయార్టీపై నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు ఆహ్వానించినా..తారక్ వస్తారా అనేది మరో కీలక అంశం.

చంద్రబాబు ఖమ్మం సభలో సీఎం..ఎన్టీఆర్ నినాదాలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో పలు జిల్లాల్లో పర్యటన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మద్దతుగా నినాదాలు వినిపించాయి. జూ ఎన్టీఆర్ జెండాలతో అభిమానులు ప్రదర్శనలు చేసారు. సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసారు. చంద్రబాబు కంచుకోట కుప్పంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఆ తరువాత మచిలీపట్నంలోనూ తారక్ అభిమానులు చంద్రబాబు సభలో జూ ఎన్టీఆర్ అనుకూల నినాదాలు చేసారు. కానీ, ఎక్కడా చంద్రబాబు వారి నినాదాలు - డిమాండ్ పైన స్పందించ లేదు. కుప్పంలో కొందరు కార్యకర్తలు జూ ఎన్టీఆర్ ను తిరిగి పార్టీలో బాధ్యతలు అప్పగించాలని నేరుగా చంద్రబాబును కోరారు. అప్పుడూ చంద్రబాబు మౌనమే పాటించారు. ఇప్పుడు తెలంగాణలో తిరిగి పార్టీకి పూర్వ వైభవం దక్కాలని కోరుకుంటున్న వేళ..ఖమ్మం సభలో జూనియర్ ఎన్టీఆర్ మద్దతు నినాదాలు హోరెత్తాయి. 2009 ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తన్న సమయంలో జూ ఎన్టీఆర్ ఇదే జిల్లాలో ప్రమాదానికి గురయ్యారు.

పవన్ కల్యాణ్ తో పొత్తు ప్రయత్నాల వేళ.. తెర పైకి తారక్ అంశం
ఇటు ఏపీలో అధికారం కోసం చంద్రబాబు తిరిగి 2014 పొత్తులను రిపీట్ చేయాలని భావిస్తున్నారు. పవన్ - బీజేపీ తో పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయి. పవన్ కల్యాణ్ తాను వైసీపీని ఓడించే బాధ్యతతో పాటుగా వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని పార్టీలను ఏకం చేస్తానని చెబుతున్నారు. పరోక్షంగా టీడీపీతో సహా అన్ని పార్టీలను ఒకే వేదిక పైకి తెస్తానని చెబుతున్నారు. ఎన్నికల వ్యూహం తనకు వదిలేయమని స్పష్టం చేసారు. కానీ, టీడీపీతో పొత్తు అంశం పైన మాత్రం నేరుగా స్పష్టత ఇవ్వటం లేదు. టీడీపీ వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ వర్సస్ ప్రధాని మోదీగా మారిన తెలంగాణ రాజకీయంలో కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా తిరిగి తమ పట్టు తెలంగాణలో నిరూపించుకొనేందుకు సిద్దమయ్యారు. అక్కడ బీజేపీకి సహకరించటం ద్వారా ఏపీలో బీజేపీ - జనసేన సహకారం తీసుకొని అధికారానికి దగ్గర కావాలనేది టీడీపీ వ్యూహంగా స్పష్టం అవుతోంది. కానీ, టీడీపీతో తిరిగి పొత్తుకు బీజేపీ ఇప్పటి వరకు అయితే సుముఖంగా లేదు. కానీ, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications