నోటికొచ్చిన అబద్ధాలే సీబీఐ దత్తపుత్రుడి విద్య- జగన్ పై జనసేన నేత నాదెండ్ల ఫైర్
ఏపీలో ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా ఇప్పటినుంచే రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది.ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడిగా పేర్కొంటూ సీఎం జగన్ చేస్తున్న విమర్శలకు జనసేన కౌంటర్లు ప్రారంభించింది. జగన్ ను సీబీఐ దత్తపుత్రుడిగా పేర్కొంటూ ఇవాళ జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు.
గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల చేత ఛీత్కారాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసి పరిపాలన చేతగాని సీబీఐ దత్తపుత్రుడయిన సీఎం జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పడమే ఆయనకు తెలిసిన విద్యని అన్నారు. పాదయాత్రలో ముద్దులు పెడుతూ నోటికొచ్చిన హామీలు గుప్పించి, మేనిఫెస్టోలో ఎడాపెడా చెప్పేసి తీరా వాటి గురించి అడిగితే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శఇంచారు. ఇప్పుడేమో 95 శాతం హామీలు నెరవేర్చాను అని మరో పెద్ద అబద్ధం చెప్పారన్నారు.
రాష్ట్రంలో మత్స్యకార భరోసాకు అర్హత ఉన్న కుటుంబాల్ని కూడా ఎందుకు పథకానికి దూరం చేశారో చెప్పాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. 2021లో లక్షా 19వేల మందికి ఇస్తున్నామని చెప్పారని, 2022లో ఆ సంఖ్య లక్షా 8 వేలకు తగ్గించిన మాట వాస్తవం కాదా? అని నాదెండ్ల ప్రశ్నించారు. జీవో 217 ద్వారా మత్స్యకారులను చేపల చెరువులకు ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలన్నారు.
మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ గారి పేరు పలికే అర్హత సీబీఐ దత్తపుత్రుడికి ఉందా అని నాదెండ్ల ప్రశ్నించారు. ఆయన దానం చేసిన ఆస్తులను, భూములను వైసీపీ వాళ్ళు కబ్జాలు చేస్తున్న విషయం జగన్ రెడ్డికి తెలియదా? అని నిలదీశారు. కాకినాడలోని ఎంఎస్ఎన్ ఛారిటీస్ కి సంబంధించిన భూమి తీసేసుకొని వైసీపీ జిల్లా పార్టీ ఆఫీస్ నిర్మించడానికి సిద్ధమైనవాళ్ళా ఆ మహాదాత గురించి చెప్పేది అని ప్రశ్నించారు.
వైసీపీలో మేనిఫెస్టోలో చెప్పిన మద్య నిషేధం ఎక్కడ అమలవుతుందో చెప్పాలని నాదెండ్ల అడిగారు. ఊరూరా మద్యం ఏరులై పారుతోందని, ప్రతి యేటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగ యువతను మభ్యపెట్టారని ఆరోపించారు. ఈ మూడేళ్లలో ఇచ్చింది ఒక క్యాలెండర్ అనీ, అదీ అరకొర ఉద్యోగాలేనన్నారు. వాటికి ఇప్పటికీ నోటిఫికేషన్లు లేవన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకొస్తామని మాట తప్పారని నాదెండ్ల గుర్తుచేశారు. అవగాహన లేక ఆ హామీ ఇచ్చామని సకల శాఖల మంత్రితో చెప్పించి మోసం చేసిన విషయాన్ని ఒప్పుకొన్నారన్నారు. ఆత్మహత్య చేసుకొన్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు రూ.7 లక్షలు ఇస్తామని చెప్పి... వాటిని ఎగ్గొట్టే పనిలో ఉన్నారని జనసేన నేత ఆరోపించారు.
వైసీపీ దారుణ పాలన చూసే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని నాదెండ్ల ఆరోపించారు. ఉన్న పరిశ్రమలు కూడా మూసేసుకొని పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారన్నారు. విద్యుత్ సంక్షోభం, రోడ్ల దుస్థితి కళ్ళెదుట కనిపిస్తున్నాయని, ఈ విషయాల గురించి ప్రజలు నిలదీస్తుంటే జగన్ రెడ్డి సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారన్నారు. మరో వైపు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను జనసేనాని పవన్ కల్యాణ్ పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తుంటే వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైందన్నారు. సీబీఐ దత్తపుత్రుడు, ఆయన అనుచరులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని నాదెండ్ల ఆరోపించారు. చేతనైతే బాధల్లో ఉన్న రైతాంగం కన్నీరు తుడవాలని కోరారు. సీపీఎస్ రద్దు చేయాలని, పెట్టుబడులు తీసుకురావాలని, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. అర్థంపర్థంలేని విమర్శలు కట్టిపెట్టకపోతే ప్రజలే బలంగా సమాధానం చెబుతారన్నారు.