మెట్రోపై రేవంత్కు తెరాస సవాల్, జగన్ వల్లేనని పల్లె
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు జూపల్లి కృష్ణారావు ఆదివారం మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అర్థంలేని ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చాలని చూస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో వేలకోట్ల రూపాయల భూములు ధారాదత్తం చేసినా నోరు మెదపని రేవంత్ ఇప్పుడు మెట్రో పైన లేనిపోని రాద్ధాంతం చేయడమేమిటన్నారు.
తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే మూడేళ్లయినా పదవులు వదల్లేదన్నారు. తెలంగాణలో భూములను ఎవరు కొల్లగొట్టారన్న అంశంపై బహిరంగ చర్చకు సిద్దమా అని రేవంత్కు సవాల్ విసిరారు. మెట్రో ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని మరికొందరు తెరాస నేతలు అన్నారు. ఆరోపణలు రుజువు చేయలేకపోతే రేవంత్ గుండు గీయించుకుంటారా? అని వారు సవాల్ విసిరారు.
మెట్రో విషయంలో రేవంత్ చెబుతున్న విషయాలు నిజమని తేలితే తాము దేనికైనా సిద్ధమన్నారు. చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి కీలుబొమ్మ అన్నారు. రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు మెట్రో ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని వారు మండిపడ్డారు. రేవంత్ మీడియా ఎదుటకు వస్తే చర్చకు సిద్ధమన్నారు.
బాబును విమర్శించే అర్హత జగన్కు లేదు: పల్లె
డిజిటల్ ఇండియా అనే పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ను ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుగ్రామాలకు కూడా బ్రాడ్బ్యాండ్ తీసుకువస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సారథ్యంలో ఏపీను ముందుకు తీసుకువెళతామన్నారు. ఇప్పటికే ఏపీ రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందన్నారు.
వికలాంగులు, స్కాలర్షిప్లు, రైతు రుణమాఫీ, డ్రాక్రా రుణ మాఫీ చేయబోతున్నామని... వీటన్నిటికి మొత్తం రూ. 65 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పేద ప్రజలను ఆదుకోవాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు క్యాంపెయిన్లు ఈ కార్యక్రమాల్లో అందరూ ఒక మాటపై నిలబడి చేస్తే అభివృద్ధిపథంలో ఆంధ్రప్రదేశ్ ముందు పోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వంద రోజుల్లో టీడీపీ ప్రభుత్వం చేసిన పనులు కాంగ్రెస్ పదేళ్లలో కూడా చేయలేదని పల్లె విమర్శించారు. కర్నూల్లో పవర్ ప్రాజెక్టు, విశాఖలో ఐటీ పార్క్, ఒక మెగా సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, మెగా ఎలకా్ట్రనిక్ హబ్గా తీర్చి దిద్దడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారని, ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
జగన్ పరుషపదాలు ఉపయోగిస్తున్నారని అది సరికాదని, చంద్రబాబును టార్గెట్ చేసుకుని అన్ పార్లమెంటరీ పదాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎవరు పనికిమాలినవారనేది రాష్ట్రంలో అందరికీ తెలుసునని, బాబును విమర్శించే నైతిక విలువ, అర్హత జగన్కు లేవన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల రక్తాన్ని పీల్చి, రూ.లక్ష కోట్లు దోచుకుని, 18 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదన్నారు.
రాష్ట్రం విడిపోవడానికి జగనే ముఖ్యకారకుడని, మొదటి ముద్దాయి అన్నారు. రాష్ట్రం విడిపోవాలని కోరుకుంది ఇద్దరే ఇద్దరని వారు జగన్, కేసీఆర్ అని మంత్రి అన్నారు. జగన్, కేసీఆర్ కుమ్మక్కయ్యారని పల్లె తీవ్రస్థాయిలో విమర్శించారు. 371 డి విషయంలో కూడా జగన్ నోరు విప్పలేదని, అందుకే ప్రజలు జగన్ను పక్కన విమర్శించారు.