జగన్ బంధువులే, అవమానాలు: జూపూడి సంచలనం
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర రావు ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసిన తనను తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బంధువులే ఓడించారని ఆరోపించారు. ఆయన గుంటూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.
నమ్ముకొన్న వారిని మోసం చేసినందుకు దేవుడు జగన్ను అధికారంలోకి రాకుండా చేశారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పదవిని పోగోట్టుకోవాల్సి వస్తుందని తెలిసినా వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం తాను కష్టపడి పని చేశానని తెలిపారు.
అయినా తనకు అన్నీ అవమానాలే మిగిలాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో దళితులు ప్రధాన పాత్ర పోషించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించాలన్నారు. వెనుకబడిన ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలని సూచించారు. జూపూడి ప్రభాకర రావు గుంటూరులో జరిగిన మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై పై వ్యాఖ్యలు చేశారు.